హోదాతో ఏపీకి నష్టమే, పవన్ అలా చేస్తారనుకోను: సుజనా షాక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. ప్రత్యేక హోదాపై కొందరు నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో హోదా కంటే ప్యాకేజీయే రాష్ట్రానికి మంచిదని ఆయన స్పష్టం చేశారు. పారిశ్రామిక రాయితీలకి, ఉద్యోగాల కల్పనకీ హోదాతో ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాలని ప్రజలు గుర్తించాలని కోరారు. హోదాతోనే అన్నీ వచ్చేస్తాయనుకోవడానికి లేదని సుజనా చెప్పారు.
'హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు భరిస్తుంది. అయితే మనకు ప్యాకేజీలో కొన్ని అంశాలకు 100 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున 2014 నుంచి అయిన వ్యయాన్ని తిరిగి ఇవ్వడంతోపాటు 100శాతం వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది'అని సుజనా చౌదరి తెలిపారు.
సుజనా చౌదరి
అంతేగాక, 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ‘ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ఈ హోదా ఉంది. వచ్చే ఏడాదితో వాటికి హోదా సమయం అయిపోతుంది. ప్రత్యేక హోదా రావాలంటే ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది' అని చౌదరి తెలిపారు.
ప్యాకేజీతో నష్టం లేదు
ఈ ప్యాకేజీతో రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లదని, ప్యాకేజీలో అంశాలను మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్లి చట్టబద్ధత కల్పిస్తామని వివరించారు. ఈ విషయంలో కేంద్రంపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మూలంగా ప్రస్తుతం పన్ను రాయితీలు ఇవ్వడంలో ఇబ్బందులున్నా పారిశ్రామిక నడవాల ఏర్పాటు ద్వారా అభివృద్ధికి ఇబ్బంది ఉండదని తెలిపారు.
తాజా ప్యాకేజీతో లాభమే
విదేశీ ఆర్థిక సంస్థల (ఈఏపీ) ప్రాజెక్టుల ద్వారా తీసుకొనే రుణాన్ని కేంద్రమే భరించబోతుందని, రాష్ట్రానికి ఇప్పటికే రూ.9వేల కోట్ల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాజా ప్యాకేజీ వల్ల ఈఏపీల కింద రూ.25వేల కోట్లను కేంద్రం అంగీకరించే అవకాశం ఉందని అన్నారు.
పవన్ తప్పుదోవ పట్టించరని నమ్మకం
అయితే, హోదా కోసం చివరి వరకూ పోరాడతామని ముఖ్యమంత్రి అనలేదని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని చౌదరి తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్ని పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టిస్తారని తాను అనుకోవడం లేదన్నారు.
జైరాం కూడా మంచిదే అన్నారు
ఇది ఇలా ఉండగా, హోదాతో రూ.60వేల కోట్లు వస్తాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నట్లు వార్తలు వచ్చాయని, దీనిపై ఆయనతో మాట్లాడినట్లు సుజన తెలిపారు. ‘తాను అలా అనలేదని, ఇది మంచి ప్యాకేజీ' అని చెప్పార'ని సుజన చౌదరి వివరించారు. కాగా, ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఏపీలో డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో సుజనా చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.