'రాజధాని కోసం టీడీపీలో సుజనాXసీఎం వర్గాలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై తెలుగుదేశం పార్టీలో ఎంపీలు సుజనా చౌదరి వర్గం, సీఎం రమేష్ వర్గాలు పట్టుపడుతున్నాయని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పార్థసారధి హైదరాబాదులో ఆరోపించారు. సుజనా గ్రూపుకు అమలాపురం రాజధాని కావాలని, సీఎం రమేష్ వర్గం నూజివీడు వైపు రాజధాని చేయాలని పట్టుపడుతున్నాయన్నారు.
విజయవాడ పరిసరాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలు కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయన్నారు. టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభనష్టాల బేరీజు వేసుకున్న తరువాతే కానీ కొత్త రాజధానిపై స్పష్టత రాదని విమర్శించారు.
చంద్రబాబు మంత్రివర్గంలో బీసీ మంత్రులకు అవమానం జరుగుతోందన్నారు. కొత్త రాజధానిలో బడుగు బలహీన వర్గాలు బతికేలా ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించాలన్నారు.
పోలవరం టెండర్ల కేటాయింపుల్లో పెదబాబు, చినబాబులకు దక్కిన వాటాలెంతో చెప్పాలన్నారు. పోలవరం అవకతవకలపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులకు అదే విస్తీర్ణంలో భూములు కేటాయించాలని సూచించారు.