సుజనా వర్సెస్ జీవీఎల్: అమరావతిపై నిలువునా చీలిన బీజేపీ: ఎన్నికల వేళ.. తలోదారి..!
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న సన్నాహాలు.. భారతీయ జనతా పార్టీలో చీలికకు దారి తీసింది. పార్టీ నాయకుల మధ్య చిచ్చు పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అమరావతి విషయంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రకటన చేస్తున్నారు.ఎవరు ఎలాంటి ప్రకటన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపాన్ని దాల్చడం సరికొత్త సమస్యలను తెచ్చిపెట్టిందని అంటున్నారు.
సుజనా ఒకలా.. జీవీఎల్ ఇంకోలా..
సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహా రావు.. ఇద్దరూ సీనియర్ నాయకులే. రాజ్యసభ సభ్యులే. అయినప్పటికీ.. వారిద్దరి మధ్య ఎలాంటి సఖ్యతా లేదని అంటున్నారు. అమరావతి ప్రాంతం నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి, హైకోర్టును కర్నూలుకు తరలించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఈ ఇద్దరు నేతల మధ్య భేదాభిప్రాయాలకు దారి తీసిందని చెబుతున్నారు. ఒకే అంశంపై ఇద్దరూ భిన్న ప్రకటనలను గుప్పిస్తున్నారు. ఒకరు చేసిన ప్రకటనలకు మరొకరు కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారం మొత్తం ప్రజల్లో గందరగోళానికి తీస్తోందని అంటున్నారు.
మూడు రాజధానులపై కేంద్రం స్పష్టం చేసినా..
మూడు రాజధానుల అంశంపై కేంద్రం ప్రభుత్వం ఇప్పటిదాకా నోరు మెదపలేదు. కిందటి నెల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడు గల్లా జయదేవ్ లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ బదులిచ్చారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే అంశంపై తాము జోక్యం చేసుకోబోమని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అంశమని తేల్చి చెప్పారు.
దూకుడుగా సుజనా..
మూడు రాజధానుల అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసినప్పటికీ.. సుజనా చౌదరి మాత్రం దానికి భిన్నమైన ప్రకటనలను గుప్పిస్తూనే ఉన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవడం ఖాయమని, అమరావతి ఎక్కడికీ పోదని ఆయన బలంగా చెబుతున్నారు. సుజనా అలాంటి ప్రకటనలు ఇవ్వడం.. జీవీఎల్ నరసింహా రావు దాన్ని ఖండించడం.. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది బీజేపీలో. ఉత్తరాఖండ్లో అధికారంలో బీజేపీ ప్రభుత్వం రెండో రాజధాని నగరాన్ని ప్రకటించిందని, దీనికోసం ఆయన కేంద్రాన్ని సంప్రదించలేదని సోదాహరణంగా జాతీయ అధికార ప్రతినిధి హోదాలో జీవీఎల్ చెబుతున్నప్పటికీ.. రాష్ట్రశాఖ నాయకులు ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు.
Recommended Video
సుజనా వైపే కన్నా
పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా వారిని నిలువరించలేకపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన సుజనా చౌదరిని సమర్థిస్తున్నారు. అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడాన్ని తాము అంగీకరించబోమనే అంటున్నారు కన్నా. స్వయంగా పార్టీ అధ్యక్షుడే తనకు అండగా ఉండటం వల్ల సుజనా మరింత దూకుడుగా ఉంటున్నారని చెబుతున్నారు. ఒకవంక స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిపై బీజేపీలో ఏర్పడిన విభేదాలు, చీలికలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన నాయకులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అంటున్నారు.