బాబు పుట్టిన రోజు సుజయ ఎంట్రీ: టిడిపి సీనియర్ల అసంతృప్తి
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు నాడు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 20న చంద్రబాబు పుట్టినరోజు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్యలో తన సోదరుడు బేబినాయనతో కలిసి సుజయ్ విజయవాడలో తెలుగుదేశం పార్టీలో చేరుతారు.
సుజయ కృష్ణ రంగారావు ప్రవేశంతో విజయనగరం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని నిలబెట్టి గెలిపిస్తే తమను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని వారు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.
పదేళ్లు టిడిపి అధికారానికి దూరమైన స్థితిలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య పార్టీని ముందుకు నడిపించిన వారెంద రో జిల్లాలో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కేసుల్లో సైతం ఇరుక్కున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలోని సీనియర్లకాదని కొత్తముఖాలకు అవ కాశాలిచ్చారని అంతా మండిపడుతున్నారు.
సీనియర్ ఎమ్మెల్యేలు కోళ్ళ లలిత కుమారి, పతివాడ నారాయణస్వామి నాయుడులు మంత్రి పదవుల కోసం రేసులో ఉన్నారు. ఒకానొక దశలో పతివాడ పేరు దాదాపు ఖరారు అయ్యింది. అయితే మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్న తప్పుడు సమాచారంతో చివరి నిమిషంలో ఆయన పేరు పక్కకు పోయి తెరపైకి పక్క జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని పేరు వచ్చింది.
మరో ఎమ్మెల్యే కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన కోళ్ళ లలితకుమారి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎస్కోట నియోజ కవర్గం నుంచి గెలుపొందారు. మహిళా ఎమ్మెల్యేగా ఆమె పేరు తొలి మంత్రి వర్గంలో వినిపించినా నిరాశే మిగిల్చా రు. జిల్లాలో పాతవారిని కాదని కొత్తవారికి పార్టీ అందలం ఎక్కించిందని గుర్రుగా ఉన్నారు.
మరో వైపు ఆపరేషన్ ఆకర్ష పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గాళం వేసి పార్టీలో చేర్చు కుంటూ వారికి బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. జిల్లాలో ముగ్గురు వైసిపి ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు పంపినా ఒక్క బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వి సుజయ్ కృష్ణ రంగారావు అతని సోదరుడు బేబీనాయనలు మాత్రమే వైసిపి నుంచి సైకిల్ సవారీకి సిద్దమయ్యారు.
ఎమ్మెల్యే సుజయ్కు మంత్రి పదవితోపాటు సోదరుడు బేబీనాయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు బేరం కుదిరింది. దీంతో బొబ్బిలిరాజులు పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ నియోజక వర్గంలో ఇంత వరకు రాజులకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ద్వారపురెడ్డి జగదీష్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన ప్రతిపక్షంలో పార్టీ ఉన్నపుడు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవికి అన్ని అర్హతలున్న ద్వారపురెడ్డి జగదీష్కు వస్తుందని ఆయన అనుచరులు, నియోజకవర్గ ప్రజలంతా ఆశతో ఉన్నారు. ఈ స్థితిలో విజయనగరం జిల్లాలో సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.