బాబు చేస్తే అంగీకరిద్దాం, బాధపడ్డా: జగన్కు సుజయ, టిడిపిలోకి వస్తూనే సమస్యలు ఏకరువు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు టిడిపి సీనియర్ నేతల సమక్షంలో సైకిల్ ఎక్కారు. సుజయతో పాటు ఆయన సోదరుడు బేబీ నయన, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు.
ఈ సందర్భంగా సుజయ మాట్లాడారు. టిడిపి కుటుంబంలో తమను భాగస్వాములను చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. 2014లో ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు తెలిసిందే అన్నారు. విభజన తర్వాత ఏపీ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోందని చెప్పారు.
విభజన నేపథ్యంలో ఏపీ ఇబ్బందుల్లో ఉన్నందున అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని, ప్రజలు టిడిపిని గెలిపించారన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబు కమిట్మెంటుతో చేసిన పనులు అంగీకరించాలని ఆయన జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే టిడిపిలో చేరుతున్నానని చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందున తాను టిడిపిలో చేరుతున్నానని చెప్పారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే.. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధికి అడ్డు తగులుతున్నామేమో అనే ఆవేదన తనకు ఉండేదన్నారు.
అందుకే తాను టిడిపిలో చేరుతున్నానని చెప్పారు. ఓ కార్యకర్తగా తనను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చంద్రబాబుకు చెప్పానన్నారు. టిడిపి క్రమశిక్షణ గల పార్టీ అని మనకందరికీ తెలుసునని, కాబట్టి మనమంతా దానిని పాటించాలని తన అనుచరులకు సూచించారు.
చంద్రబాబుకు మన కష్టాలు తెలుసు
చంద్రబాబుకు మన జిల్లా కష్టాలు, ఇబ్బందులు అన్నీ తెలుసునని, ఆయనకు తెలియనివి అంటూ ఏమీ లేవన్నారు. ఆయన జిల్లా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారని చెప్పారు. తాము టిడిపిలో చేరడం వల్ల ఎవరికీ ఇబ్బందులు కలిగించమని చెప్పారు. అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు.
మన ప్రాంత అభివృద్ధికి చంద్రబాబుతో కలిసి నడుద్దామన్నారు. అలా అయితే విజయనగరం జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీకి తిరుగు లేకుండా ఉంటుందని చెప్పారు. అందరు కలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పారు.
బేబీ నయన మాట్లాడుతూ... అశోక్ గజపతి రాజుతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా ఉంటారని చెప్పారు. నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్పారు.
జగన్కు దిశానిర్దేశనం లేదు: కళా
కళా వెంకట్రావు మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం కూడా సహకరించాలన్నారు. చంద్రబాబు కృషిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షానికి, ప్రతిపక్ష నేతకు సరైన దిశా నిర్దేశనం లేదన్నారు. అర్జునుడికి చెట్టు పైన పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు, చంద్రబాబు అభివృద్ధి పైనే దృష్టి సారిస్తున్నారన్నారు.
ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందన్నారు. చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యమని ప్రజలు టిడిపికి పట్టం గట్టారన్నారు. చంద్రబాబు ఏపీని దేశంలో నెంబర్ వన్గా నిలిపేందుకు కష్టపడుతున్నారన్నారు.