2019లో కనిపించరు, ఖాయం: జగన్కు సుజయ హెచ్చరిక, బొత్సపై సంచలనం
వైయస్సార్ కాంగ్రెస్పై, ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణపై మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజయ కృష్ణ రంగారావు ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్పై, ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణపై మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజయ కృష్ణ రంగారావు ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాదులో కూర్చొని రాజకీయాలు చేయడం ఏమిటని వైసిపిని ఎద్దేవా చేశారు.
తనపై బొత్స నిరాధార ఆరోపణలు చేశారన్నారు. మీ అవినీతి సాక్ష్యాలను తగులబెట్టిన చరిత్ర అందరికీ తెలుసునని ధ్వజమెత్తారు. బొత్సకు నిజాయితీ ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు.
2019లో వైసిపి శాశ్వతంగా రాజకీయాలకు దూరం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతిని తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 2019లో వైసిపి శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావడం ఖాయమని జగన్ను హెచ్చరించారు.
బొత్స రిమోట్ రాజకీయాలకు కాలం చెల్లింది
బొత్స రిమోట్ కంట్రోల్ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. బొత్స ఝాన్సీ ఎంపీ లాడ్స్ నిధుల్లో పర్సెంటేజీలు తీసుకున్న విషయం అందరికీ తెలుసునని సంచలన ఆరోపణలు చేశారు.
మోసం చేసి ఓట్లడుగుతున్నాయి..
టిడిపి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందించి ఓట్లు అడుగుతుంటే, తల్లి, పిల్ల కాంగ్రెస్లు ప్రజల్ని నిట్టనిలువునా మోసం చేసి ఓట్లడుగుతున్నాయని అంతకుముందు సుజయకృష్ణ రంగారావు ధ్వజమెత్తారు.
తాజ్ మహల్ లాంటి నిర్మాణాలా..
ప్రజల సొమ్ముతో తాజ్మహల్ను తలదన్నేలా విలాస భవనాలు, విదేశాల్లో పరిశ్రమలు, ఇడుపులపాయలో ఇంటిముందు రోడ్లు నిర్మించుకున్న చరిత్ర తల్లి, పిల్ల కాంగ్రెస్లదేనని ఆరోపించారు.
రూ.200 దిగమింగి..
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం రూ.400 పింఛను ఇస్తే... దానిలో రూ.200 దిగమింగి, రూ.200 వృద్ధులకు ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చాం కాబట్టి మాకు మద్దతివ్వండని రాహుల్ గాంధీ కోరలేదా? అని నిలదీశారు.