మోసం, కక్ష సాధింపు: కేంద్రంపై టీడీపీ ఎంపీల విమర్శలు, స్పీకర్ ఆగ్రహం, సభ నుంచి వాకౌట్
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు లోక్సభలో ప్లకార్డులు ప్రదర్శించడంపై స్పీకర్ సుమిత్ర మహాజన్ టీడీపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు.
ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ.. బీజేపీ ఏపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఒక్కసారైనా ఎన్నికల్లో గెలిశారా? అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావునుద్దేశించి విమర్శించారు. హోదాపై కేంద్రం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని చెప్పడం అబద్ధమని అన్నారు.
ఎన్టీఆర్ చెప్పినట్లు తాము మడమ తిప్పమని, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నామని మురళీమోహన్ చెప్పారు. రైల్వే జోన్ అంశంపైనా కేంద్రం మాయమాటలు చెబుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర 3జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు మంగళవారం ఢిల్లీ వస్తారని, వారితో కలిసి తాము రైల్వే మంత్రిని కలుస్తామని చెప్పారు. సానుకూలంగా స్పందించకుంటే నిరసన చేపడతామని చెప్పారు.
టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీని బీజేపీ మోసం చేసిందన్నారు. యూసీల పేరుతో ఏపీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తోందని అన్నారు. మరో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీపై ప్రధాని నరేంద్ర మోడీ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అకౌంట్లలో డబ్బులు వేసి మరీ వెనక్కి తీసుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. కాగా, ఎంపీ శివప్రసాద్ ఈరోజు శ్రీరాముడి వేషాధారణలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రానికిచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా నిరసనలు చేపట్టారు.