అగ్నిగోళం: పిట్టల్లా రాలుతున్న వ్యక్తులు, రోడ్డుపై ఉడికిన ఆమ్లెట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సూర్యుడు మండిపోతున్నాడు. వడదెబ్బకు, వేడికి ప్రజలు విలవిలలాడుతున్నారు, మృత్యువాత పడుతున్నారు. వడగాల్పులకు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. గురువారం ఒక్క రోజే రెండు రాష్ర్టాలలో 27 మంది మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్లో 14 మంది, తెలంగాణలో 13 మంది ఒడదెబ్బకు మృతి చెందారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. నల్లగొండ 45 డిగ్రీలు, వరంగల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున ఎండలకు మృత్యువాత పడ్డారు. విజయవాడ, నెల్లూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. రెంటచింతల 45, రాజమండ్రి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్లో 44, ఖమ్మం 45, నల్గొండ 43, కరీంనగర్ 46, నిజామాబాద్ 43, అదిలాబాద్ 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. వరంగల్ జిల్లాలోని చెల్పూరు కేటీసీఎస్ దగ్గర 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గురువారం ఉదయం 9 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
ఎండ తీవ్రత ఎలా ఉందో చూడడానికి వరంగల్ జిల్లా మహబూబాబాద్లోని చేపల మార్కెట్లో కొందరు యువకులు రోడ్డుపైనే ఆమ్లేట్ వేశారు. ముందుగా రోడ్డుపై ఇనుప పెనాన్ని ఉంచారు. అది ఎండకు వేడెక్కిన తర్వాత అందరూ చూస్తుండగానే ఆమ్లేట్ వేశారు. మూడు నిముషాల్లోనే అమ్లేట్ తయారయింది.
సికింద్రాబాదులో విజయవాడవాసి మృతి
వడదెబ్బకు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి సికింద్రాబాదులో మరణించాడు. విజయవాడకు చెందిన మధుసూదనరావు అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. అక్కడ వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతను మరణించాడు.
ఇలా మృత్యువాత
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామానికి చెందిన గొర్రె లింగయ్య (55) గురువారం ఎండదెబ్బకు మరణించాడు. రాయికల్ మండల కేంద్రానికి ెచందిన కామోజు గణేష్ (10) అనే బాలుడు గురువారం వడదెబ్బకు మృత్యువాత పడ్డారు. బుధవారంనాడు ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన ల్యాగల వజ్రవ్వ (45) అనే మహిళ మరణించింది.
రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో ఆంజనేయులు (49) అనే వ్యక్తి వడదెబ్బకు మరణించాడు. మహబూబ్నగర్ జిల్లాలో బుధవారంనాడు ఇద్దరు వ్యక్తులు మరణించారు. రాజోలీ గ్రామానికి చెందిన పెద్దింటి నాగన్న (59), గిరిజ (48) వడదెబ్బకు మృత్యువాత పడ్డారు.