జగన్, విజయసాయిలకు సమన్లు: ఈడీ ఫిర్యాదు, కోర్టుకు విచారణ
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫార్మ కంపెనీలైన అరబిందో, హెటిరో వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదును గురువారం ఈడీ ప్రత్యేక కోర్టు, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది.
ఈ ఫిర్యాదులో ప్రధాన నిందితుడైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడు జగన్మోహన్రెడ్డి తోపాటు 19 మందికి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి రజని సమన్లు జారీ చేశారు. మార్చి 28న నిందితులు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: జగన్తో జాగ్రత్త! కేంద్రానిదే బాధ్యత: బాబు, మేమున్నాం: వెంకయ్య
సమన్లు జారీ అయిన నిందితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ నేత వి విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఎం శ్రీనివాసరెడ్డి(హెటిరో డైరెక్టర్), హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్, హెటిరో హెల్త్ కేర్, కె నిత్యానందరెడ్డి(అరబిందో ఎండీ), అరబిందో ఫార్మ, ఏపీఎల్ హెల్త్ కేర్, పి శరత్శ్చంద్రారెడ్డి(ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ మాజీ ఎండీ), ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ (ప్రస్తుత యాక్సిస్ క్లినికల్స్), పివి రాంప్రసాద్రెడ్డి, కె ప్రసాద్రెడ్డి(నిత్యానందరెడ్డి సోదరుడు), కె రాజేశ్వరి(నిత్యానందరెడ్డి భార్య), పిఎస్ చంద్రమౌళి(అరబిందో ఫార్మ కంపెనీ మాజీ కార్యదర్శి), ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య(ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్, ఎండీ), వైవిఎల్ ప్రసాద్(ఏపీఐఐసీ రిటైర్డ్ జనరల్ మేనేజర్)లు ఉన్నారు.
కాగా, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద సెజ్లో అరబిందో గ్రూపు, హెటిరో గ్రూపులకు 75 ఎకరాల చొప్పున జరిగిన భూకేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎకరం రూ.15 లక్షలకు కేటాయించాల్సి ఉండగా రూ.7లక్షలకే కేటాయింపులు జరిగాయని, అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్రెడ్డి చెప్పారంటూ నాటి ఏపీఐఐసీ ఎండీ బిపి ఆచార్య కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమోదం చెప్పేలా చూశారని సీబీఐ పేర్కొంది.
అరబిందో గ్రూపుతో సంబంధం లేకపోయినా అనుబంధమంటూ పాశమైలారంలో దానికి కేటాయించిన 30.33 ఎకరాలను ట్రైడెంట్ లైఫ్సైన్సెస్కు బదిలీ చేయడంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలిపింది. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగా జగన్ కంపెనీలైన జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాల్లో ముడుపులుగా రూ.29.50కోట్లు పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది.
అరబిందో గ్రూపునకు చెందిన నిత్యానందరెడ్డి భార్య, సోదరులు రూ.3కోట్లు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ రూ.7కోట్లు జగతిలో, హెటిరో గ్రూపు రూ.15కోట్లు జనని ఇన్ఫ్రాలో, రూ.4.50కోట్లు జగతిలో పెట్టుబడులు పెట్టాయని తెలిపింది.
ఈ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టి పెట్టుబడుల మళ్లింపులో మనీలాండరింగ్ చట్టం కింద ఉల్లంఘనలు జరిగాయని తేల్చింది. నిందితులను విచారించి చట్టప్రకారం శిక్షించాలని అభ్యర్థిస్తూ ఫిర్యాదును ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ ఫిర్యాదును విచారణ నిమిత్తం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మార్చి 28న నిందితులు వ్యక్తిగతంగా హాజరుకావాలని జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.