వైయస్ జగన్ అనుచరుడు సునీల్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణం కేసులో నిందితుడు సునీల్ రెడ్డికి హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. సునీల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. సునీల్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.
సునీల్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై కోర్టు మంగళవారం, గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న తుమ్మల రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ రెడ్డిని అక్రమంగా కేసులో ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది శ్రీరామ్ వాదించారు. సునీల్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డిని పోలీసులు నిరుడు జనవరి 25వ తేదీన అరెస్టు చేశారు. అప్పటి నుంచి కూడా యాయన జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఎఎస్ అధికారితో పాటు ఇతర నిందితులందరికీ కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని న్యాయవాది శ్రీరామ్ గుర్తు చేశారు.
సునీల్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించింది. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత కోర్టు సునీల్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు సునీల్ రెడ్డిని ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో సునీల్ రెడ్డి సోమవారం చంచల్గుడా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.