కేసీఆర్ వ్యాఖ్య:సునీత కంటతడి, ఊగిపోయిన జగ్గారెడ్డి
హైదరాబాద్: మెదక్ లోకసభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున బరిలోకి దిగిన మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి గురువారం కంటతడి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె కన్నీరు కార్చారు.
నర్సాపూర్లో నిర్వహించిన రోడ్డు షోలో ఆమె మాట్లాడారు. వ్యక్తులను కించపర్చేలా మాట్లాడటం కేసీఆర్కు తగదన్నారు. డబ్బు సంచులు ఇస్తేనే సేవ చేసినట్లా, తెరాస అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం చేశారని టిక్కెట్ ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన తనను చెల్లని రూపాయి అని విమర్శించారని సునీతా కంటతడి పెట్టారు.
జగ్గారెడ్డి హెచ్చరిక
తెలిసో తెలియకో కేసీఆర్ మాటలు నమ్మి మొన్నటి ఎన్నికల్లో తనను ఓడగొట్టారని, ఈసారి ఉప ఎన్నికల్లో సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాల నుండి రెండు లక్షల మెజార్టీ ఇవ్వాలని మెదక్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ - టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డి ఓటర్లను కోరారు. జిల్లాలో బీజేపీ శ్రేణులు, కార్యకర్తల జోలికి వస్తే మంత్రి హరీష్ రావు అంతు చూస్తానని, నీ గుండెలోల్లో నిద్రపోతానని, ఖబడ్దార్ కేసీఆర్ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన సంగారెడ్డిలో నిర్వహించిన సభలో మాట్లాడారు.
తనను గెలిపిస్తే నిత్యం పప్పు బెల్లాలే.. లేకుంటే మీకు కనబడకుండా ఉంటానని చెప్పారు. జిల్లాకు సాగు, తాగునీరుతో పాటు మియాపూర్ నుండి సంగారెడ్డికి మెట్రో రైలును తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిపిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నియోజకవర్గానికి తీసుకు వస్తానని, ఏమైనా చేయండి.. ఈసారి నన్ను గెలిపించండి... దండం పెడతానని జగ్గారెడ్డి అన్నారు.