మలుపులు: మెదక్ ఎంపి అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి?
హైదరాబాద్: మెదక్ పార్లమెంటు స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో విస్తృత మంతనాలు జరిపిన అంతరం మెదక్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొదట మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినా.. సునీతా లక్ష్మారెడ్డి వైపే ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మెదక్ స్థానాన్ని ఎలాగైన కైవసం చేసుకుని తెలంగాణలో కాంగ్రెస్కు పునరుత్తేజం తేవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తెలంగాణ నేతలతో దిగ్విజయ్ సింగ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రెండు రోజులపాటు దిగ్విజయ్ సింగ్ ఇక్కడే వుండి నేతలతో మంతనాలు సాగించనున్నట్లు తెలిసింది.
అయితే మెదక్ స్థానం నుంచి ఎవరు పోటీ చేసేది అధికారికంగా ప్రకటించలేదు. మెదక్ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆయన భార్య పద్మినీ రెడ్డి, మాజీ కేంద్రమంత్రులు సర్వే సత్యనారాయణ, జైపాల్ రెడ్డిలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.