సన్ స్ట్రోక్: ఆఫీస్లో సొమ్మసిల్లి పడిన రఘువీరా
కర్నూలు/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి వడదెబ్బ తాకింది. ఆయన కర్నూలు జిల్లాలో సొమ్మసిల్లి పడిపోయారు. కర్నూలు జిల్లా డీసీసీ కార్యాలయంలో ఆయన ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఏపి కౌన్సిల్కు వైకాపా అభ్యర్థిగా గోవింద రెడ్డి నామినేషన్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీ కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోవింద రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం అసెంబ్లీ కార్యదర్శి కె సత్యనారాయణకు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు.
ఎపి కౌన్సిల్లో నాలుగు స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాఉండగా గోవింద రెడ్డి లోగడ రోడ్డు రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహించారు.
స్మగ్లర్లను పూర్తిగా ఏరివేస్తాం
మారిషస్ దేశం జైల్లో ఉన్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగగ్గానే రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చిన్నరాజప్ప అన్నారు. చిత్తూరు జిల్లాలో బుధవారం సుడిగాలి పర్యటన చేసిన ఆయన సాయంత్రం చిత్తూరు టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు చేయడంలో ఎక్కడా రాజీపడేది లేదని,స్మగ్లర్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదన్నారు. గంగిరెడ్డి ఆస్తుల జప్తు చేసే విషయంపై కూడా ఆలోచిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గత 10 ఏళ్లకాలంలో వేల కోట్ల రూపాయలు ఎర్రచందనం దేశ సరిహద్దులు దాటిందన్నారు.