సింగర్ స్మిత సపోర్ట్: రాజధాని రైతులకు నేనున్నా, గుండె పగిలిపోతోందని ట్వీట్..
అమరావతి రాజధాని మార్పుపై సినీ ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు బాసటగా నిలుస్తామని సినీతారలు ప్రకటన చేస్తున్నారు. హీరో నారా రోహిత్ రైతులకు ఇప్పటికే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నేపథ్య గాయనీ స్మిత కూడా సపోర్ట్ చేస్తానని తెలిపారు.
అమరావతి రాజధాని తరలింపు చాలా బాధాకరమని సింగర్ స్మిత అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రైతులది ఆరణ్య రోదన అని, వారి పరిస్థితి చూస్తుంటే గుండె పగిలిపోతుందని చెప్పారు. తమ జీవనాధారమైన పంట పొలాలను రాజధాని కోసం ఇచ్చారని గుర్తుచేశారు. రైతుల బాధ తీరనిదని.. కానీ వారికి తాను అండగా ఉంటానని పేర్కొన్నారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులను కొందరు పట్టించుకోవడం లేదని ట్వీట్లో స్మిత పేర్కొన్నారు. మాకేందుకులే అని ప్రవర్తించడం సరికాదని సూచించారు. తాను అలా కాదని.. రైతుల బాధను పంచుకుంటూ.. న్యాయం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చానా 29 గ్రామాల రైతులకు తాను అండగా ఉంటానని స్మిత భరోసానిచ్చారు.
తమకు సినీతారలు మద్దతు తెలుపడంపై రాజధాని రైతులు స్వాగతిస్తున్నారు. తమ కష్టాన్ని పంచుకొంటున్న ప్రతీ ఒక్కరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని మాత్రం మార్చొద్దని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.