ఏపీ సహా 9 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు: కేంద్రానికి కూడా
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార శాఖ కమిషనర్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషనర్(ఎస్ఐసీ) నియామకాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది.
కేంద్రంతోపాటు మొత్తం తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంపై నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న ఈ 9 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉండటం గమనార్హం. కమిషనర్ల నియామకాల్లో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడం లేదని సమాచారా హక్కు చట్టం కార్యకర్త అంజలీ భరద్వాజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు సూచించిన విధంగా కమిషనర్ పదవి కోసం ఎంపిక చేసిన వారి పేర్లను వెబ్సైట్లో పొందుపర్చలేదని పిటిషన్దారుల తరపున వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాలు ఎస్ఐసీలను నియమించిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
కాగా, ఖాళీగా ఉన్న సీఐసీ, ఎస్ఐసీ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిషన్లో పదవులు ఖాళీ అయ్యే సమయానికి ఒకటి రెండు నెలల ముందే నియామకాల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో పాటించిన నిబంధనల ప్రకారమే సీఐసీ నియామకం చేపట్టాలని స్పష్టం చేసింది. సీఐసీ, ఎస్ఐసీలో ఉన్న ఖాళీలను ఆరు నెలల్లోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ, ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు నియామకం చేపట్టలేదు.
ఎంపిక చేసిన రాష్ట్రాల్లో చాలా వరకు అధికారులనే ఎంపిక చేయడంతో సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం కమిషనర్ల నియామకానికి అధికారులతోపాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.