ఫాతిమా కాలేజీ విద్యార్థులకు షాక్: పిటిషన్ కొట్టివేత, భోరున ఏడ్చిన స్టూడెంట్స్
కడప ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల కేసులో ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
కడప: కడప ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల కేసులో ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు, ఎంసీఐ ప్రతిపాదనలు పరిశీలించినట్టు న్యాయ స్థానం తెలిపింది.
ఈ ఏడాది సీట్లు పెంచితే వచ్చే ఏడాది సీట్లు తగ్గించమంటారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఈ పిటిషన్లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు నిర్ణయంతో 'ఫాతిమా' విద్యార్థులు తీవ్రంగా నిరాశ చెందారు. కొందరు విద్యార్థులు భోరున విలపించారు. వందసీట్లను తగ్గించుకుంటామని ఏపీ ప్రభుత్వం లిఖితపూర్వంగా అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతోనే కేసును కొట్టేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీట్లు రీలొకేట్ చేయకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు ఫాతిమా కాలేజీ విద్యార్థులు. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని అసమర్థత వల్లే తమకు న్యాయం జరగలేదన్నారు.
ఇకనైనా విద్యార్థుల సమస్యలపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామంతా ఆత్మహత్యలు చేసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.