రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. తన భద్రతతోపాటు తన తనయుడిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ ఇంటిలిజెన్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ పై దాడికి సంబంధించిన కేసులో ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది అదనపు సమాచారం అందించేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది కాబట్టి విచారణ పూర్తికానివ్వాలనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కూడా అక్కడి ధర్మాసనం కొట్టేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లోని రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ను నిర్బంధించి దాడిచేశారనే విషయమై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాడికి సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుందని, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా సస్పెండయ్యారని వెల్లడించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు రఘురామ పిటిషన్ ను కొట్టేసింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా విచారణ పూర్తవ్వాలని కోరుతూ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. గచ్చిబౌలిలోని రఘురామ ఇంటివద్ద జరిగిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ప్రధానమంత్రి చేతులమీదగా జరిగింది. ఎంపీ సొంత నియోజకవర్గం కిందకు ఇది వస్తుండటంతో ఆయన అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించి ఆగిపోయారు. తర్వాత రెండురోజులకు హైదరాబాద్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పోటాపోటీగా కేసులు నమోదు చేసుకున్నాయి.