మూడు రాజధానుల అనుకూల పిటిషన్- కొట్టేసిన సుప్రీంకోర్టు-కీలక వ్యాఖ్యలు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం ఎంత వేగంగా అడుగులు వేసినా ప్రస్తుతం న్యాయప్రక్రియలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఈ ఏడాది అయినా మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. హైకోర్టులో మూడు రాజధానులకు కారణమైన రెండు కీలక చట్టాలకు బ్రేక్ పడటమే ఇందుకు ప్రధాన కారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో రాజధానులను వ్యతిరేకిస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్లో తమను కూడా ఇంప్లీడ్ చేయాలంటూ సుప్రీంకోర్టులో వచ్చిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్దానం తోసిపుచ్చింది.
Recommended Video
సీఆర్డీయే, వికేంద్రీకరణ చట్టాలపై పిటిషన్లు..
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డేయే చట్టం రద్దు కోసం ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రెండు చట్టాలను తీసుకొచ్చింది. వీటిని అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదించినా మండలిలో ఓసారి సెలక్ట్ కమిటీకి ప్రతిపాదనలు వెళ్లగా, మరోసారి బిల్లులు ప్రవేశపెట్టేందుకే అవకాశం కుదరలేదు. అయినా ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ రెండోసారి ఆమోదమే శాసన వ్యవస్ధ ఆమోదంగా గవర్నర్ కూడా గుర్తించారు.
దీంతో ఈ రెండు బిల్లులు చట్టాలుగా మారిపోయాయి. వీటిపై ఇప్పుడు హైకోర్టులో, సుప్రీంకోర్టుల్లో పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ రెండు చట్టాల ఆమోదం చట్టబద్ధం కాదని కోర్టు తీర్పు ఇస్తే చాలు రాజధానుల ప్రక్రియ ఆగిపోతుందని పిటిషనర్లు ఆశాభావంగా ఉన్నారు.
రాజధాని చట్టాలపై పిటిషన్పై ఇంప్లీడ్ అవుతామంటూ
ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీయే, వికేంద్రీకరణ చట్టాలను వ్యతిరేకించే వారు ఎందరు ఉన్నారో అనుకూలంగా ఉన్న వారు కూడా అంతేమంది ఉన్నారు. ముఖ్యంగా ఈ చట్టాల వల్ల కొత్త రాజధానులుగా మారుతున్న విశాఖ, కర్నూలు ప్రజలతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల ప్రజలు కూడా ఈ చట్టాలకు అనుకూలంగా ఉన్నారు.
దీంతో ఏపీ హైకోర్టులో ఈ చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని రైతు పరిరక్షణ సమితి గతంలో దాఖలు చేసిన పిటిషన్లో తమను కూడా పార్టీగా చేర్చుకోవాలని హైకోర్టును కోరగా తిరస్కరించిందని, తమకు అవకాశం కల్పించాలని కోరుతూ రాయలసీమకు చెందిన బి.శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రాజధానుల ఏర్పాటు ఆగిపోతే రాయలసీమ నష్టపోతుందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
రాజధానుల పిటిషన్పై సుప్రీం ఆశ్చర్యం
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన రెండు చట్టాలను సమర్ధిస్తూ వీటికి వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్లో ఇంప్లీడ్ అవుతానంటూ రాయలసీమ న్యాయవాది శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ప్రభుత్వాలు మాత్రమే తాము తీసుకొచ్చిన చట్టాలను సమర్ధించుకోగలవని, వ్యక్తులు కూడా చట్టాలకు మద్దతుగా కోర్టుకు వస్తారా అని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. మీ పిటిషన్ను అనుమతిస్తే చట్టాలకు మద్దతుగా, వ్యతిరేకంగా వేల మంది న్యాయస్ధానాలను ఆశ్రయిస్తారని పేర్కొంది.
రాజధానుల అనుకూల పిటిషన్ కొట్టివేత
ఏపీ హైకోర్టులో రాజధాని చట్టాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని రాయలసీమ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను ప్రాధమికంగా విచారించిన సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. చట్టాలను ప్రభుత్వం మాత్రం సమర్ధించుకోవాలని, వ్యక్తులు కాదని తెలిపిన సుప్రీం ధర్మాసనం.. న్యాయవాదులు గ్రూపుగా ఏర్పడి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. దీంతో రైతుల తరహాలోనే న్యాయవాదులు కూడా హైకోర్టులో రాజధాని చట్టాలను సవాల్ చేస్తున్న పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యే అవకాశం దక్కింది.