జగన్ సర్కార్ను వదలని రంగుల మరక: సుప్రీంలోనూ ఎదురుదెబ్బే: హైకోర్టు ధిక్కరణ అంటూ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంగుల బెడద తప్పట్లేదు. ఏ ముహూర్తాన ప్రభుత్వ కార్యాలయాలకు రంగులను వేయాలని నిర్ణయించుకుందో తెలియట్లేదు గానీ.. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. వరుసగా ఎదురుదెబ్బలను తింట్లోంది. చివరికి కోర్టు ధిక్కరణను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది. రంగుల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది జగన్ ప్రభుత్వానికి.
జగన్ సర్కార్ వెనకడుగు: హైకోర్టు మెట్లెక్కనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి?: తెలుపుతో సరి
నాలుగు వారాలు గడువు..
రాష్ట్రంలో ఇప్పటిదాకా గ్రామీణ స్థాయిలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు వేసిన రంగులన్నింటినీ తొలగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్వరరావు బెంచ్ బుధవారం జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిని తొలగించడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇప్పటిదాకా పాటించకపోవడాన్ని కోర్టు ధిక్కరణ కిందికి తీసుకుంటామని హెచ్చరించింది. కొత్తగా ఎలాంటి రంగులను వేయాలనేది సూచించలేదు. ఫలితంగా- ఇదివరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే అనుసరించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
హైకోర్టులో ఇదివరకే స్పష్టం చేసిన ప్రభుత్వం..
ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన అధికార వైఎస్ఆర్సీపీ జెండా రంగులతో పాటు అదనంగా వేసిన రంగులన్నింటినీ తొలగించడం ఖాయమైంది. వాటి స్థానంలో తెలుపురంగును వేస్తారు. గ్రామ సచివాలయం సహా గ్రామీణ స్థాయిలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ప్రభుత్వ భవనాలన్నింటికీ తెలుపు రంగులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అంగీకరించింది. ఇదే విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ హైకోర్టుకు స్పష్టం చేశారు. దీనికోసం ఆమె కిందటి నెల 28వ తేదీన హైకోర్టుకు స్వయంగా హాజరయ్యారు.
రంగుల వ్యవహారంపై ముందునుంచీ వివాదాలే..
అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, పంచాయతీ రాజ్ కార్యాలయాలకు పార్టీ రంగులను వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దీనికోసం 623 జీవోను విడుదల చేసింది. అది కాస్తా దుమారానికి దారి తీసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు ఎలా పూస్తారంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా..తాజాగా అక్కడా ఎదురుదెబ్బే తగిలింది.
Recommended Video
ఈ నాలుగు వారాల్లోగా రంగులను తొలగించకపోతే
ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులను నాలుగు వారాల్లోగా తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని జస్టిస్ నాగేశ్వరరావు హెచ్చరించారు. హైకోర్టు చాలా స్పష్టంగా ఈ రంగుల వ్యవహారంపై తీర్పు ఇచ్చిందని, దాన్ని ఇంకా ఎందుకు అమలు చేయలేదంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ను కొట్టేసింది. కేంద్ర కార్యాలయాలు అన్నీ కాషాయరంగు వేస్తే ఊరుకుంటారా? అని బెంచ్ నిలదీసినట్లు తెలుస్తోంది.