సంక్రాంతి కోడిపందాలకు సుప్రీం కోర్టు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్: సంక్రాంతి సందర్బంగా నిర్వహించే కోడి పందాలపై నిషేధం విధిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాని హైకోర్టును ఆదేశించింది.
అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కోడిపందాలు సంక్రాంతి సంస్కృతిలో భాగమని వాటిని నిషేధించడం తగదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కోళ్లకు కత్తి కట్టకుండా, బెట్టింగులకు పాల్పడకుండా కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును కోరారు.
దీనిపై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కోడిపందాలకు అనుమతి ఇవ్వటంతో పందెంరాయుళ్లు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.