ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్... సుప్రీంకోర్టు స్టే, హైకోర్టుకు కీలక సూచనలు
న్యూఢిల్లీ / అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవోపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. అంతేకాదు కేసును నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. 50 శాతానికిపైగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని..స్థానికసంస్థల ఎన్నికలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరిగింది. ఈ పిటిషన్లను బిర్రు ప్రతాప్ రెడ్డి, బీసీ రామాంజనేయులు దాఖలు చేశారు.
అంతకుముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం 59 .85 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిందని పిటిషన్లో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు..కొత్త సెక్షన్లు రాజ్యంగా విరుద్దంటమూ పిటీషన్ లో వివరించారు.రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీవో 176ను రద్దు చేయాలని పిటీషనర్ కోరారు.
ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో చేర్చిన 9, 15, 152, 153, 180, 181వ సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని కొట్టివేయాలని అభ్యర్థించారు. కాగా, ఈ పిటిషన్లలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్, అనంతపురంజిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని ప్రతివాదులుగా చేర్చారు.
పిటిషన్ను విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై జారీ చేసిన 176 జీవోపై స్టే ఇచ్చింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలపై నీలిమేఘాలు అలుముకున్నాయి.