తల్లితండ్రులు కోరారని ఇంగ్లీష్ మీడియం అమలు చేయలేం - సుప్రీం ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు..
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషను కాదని, ఇంగ్లీష్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే హైకోర్టు కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా, కేంద్రం కూడా మాతృభాషకే జై కొట్టడంతో ఏపీ సర్కారుకు ఫలితం దక్కేలా లేదు.
ఏపీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై సుప్రీం ఛీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంగ్లీష్ మీడియం అమలుపై సుప్రీంకోర్టులో కాస్తయినా ఊరట దక్కుతుందని భావిస్తున్న ప్రభుత్వానికి ఇవి నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ మీడియం అమలుపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్ధానం తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేసింది.
ఇవాళ ఇంగ్లీష్ మీడియం పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల్లోనూ మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నారని బాబ్డే అన్నారు. 96 శాతం తల్లితండ్రులు కోరారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను బాబ్డే తప్పుబట్టారు.
తల్లితండ్రులు కోరారని ఇంగ్లీష్ మీడియంకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేమన్నారు. పునాది గట్టిగా ఉంటే తర్వాత ఏ భాష అయినా నేర్చుకోవచ్చని విచారణ సందర్భంగా జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. కోర్టు కేసుల కారణంగా ఈ ఏడాది ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుకావడం లేదు. కనీసం వచ్చే ఏడాది అయినా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.