సుప్రీంకోర్టులో ఆనం కుటుంబానికి...పెద్ద ఎదురుదెబ్బ
నెల్లూరు:సుప్రీంకోర్టులో ఆనం కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బతగిలింది. ఆనం ఫ్యామిలీకి చెందిన వీఆర్ కాలేజీ కమిటీని రద్దు చేస్తూ సుప్పీం తీర్పు ఇచ్చింది. కాలేజీకి జులై లోగా కొత్త కమిటీ వేయాలని ఆదేశించింది.
దీంతో గత 25 ఏళ్లుగా వీఆర్ కాలేజీ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆనం వివేకాకు ఇది పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు. ఈ కాలేజీ పేరు మీద రూ.700 కోట్లు నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బులను ఆనం బ్రదర్స్ వాడుకుంటున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో నిజమెంతో తెలియదు కానీ తాజా పరిణామంతో ఇకపై ఆనం బ్రదర్స్ కాలేజ్ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదు.
వీఆర్ కాలేజీ కమిటీ నిర్ణయాలు చెల్లవంటూ గతంలో కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఆనం బ్రదర్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం హై కోర్టు తీర్పును ఖరారు చేయడంతో పాటు ఏకంగా కమిటీనే రద్దు చేయడం ఆనం బ్రదర్స్ అసలు ఊహించని పరిణామం. సుప్రీంకోర్టు తీర్పు నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.