కోడిపందాలు ఆపేలా ఉత్తర్వులు ఇవ్వలేం: సుప్రీంకోర్టు
సంక్రాంతి కోడి పందాలపై సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. కోడి పందాలను ఆపేలా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో భాగంగా మారిపోయిన సంక్రాంతి కోడి పందాలపై సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. కోడి పందాలను ఆపేలా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో హైకోర్టు నిషేధపు ఉత్తర్వులు ఇచ్చిందని, అయినా, పందాలు నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులు సిద్ధపడ్డారని జాతీయ జంతు సంరక్షణా విభాగం కోర్టులో వాదించింది.
కాగా, ఇది తమ సంస్కృతిలో భాగమని, కోడి పుంజులు ఎదురు పడితే పోరాడుకోవడం వాటి జాతి నైజమని నిర్వాహకుల తరఫు న్యాయవాది వాదించారు. అంతేగాక, పోటీల సందర్భంగా ఎలాంటి జంతు హింస ఉండదని, కోళ్లకు కత్తులను కట్టబోమని కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కోడిపందాలను ఆపేలా ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందాల జోరు
ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందాలతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగ్ రాయిళ్లు రంగంలోకి దిగి తమ కార్యక్రమాలను జోరుగా సాగిస్తున్నారు. గోదావరి జిల్లాలతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా కోడి పందాలు జరుగుతున్నాయి.