సుప్రీంకోర్టుకు చేరిన ఏపీ స్థానిక ఎన్నికల వ్యవహారం: రేపు లలిత్ ధర్మాసనం ముందుకు ప్రభుత్వ పిటిషన్..
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేయడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారని ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం ఫైల్ చేసిన పిటిషన్ను లలిత్ ధర్మాసనం ధృవీకరించింది. మంగళవారం నాటి లిస్ట్లో నమోదు చేయాలని రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీచేసింది. ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్స్పై మంగళవారం సర్వోన్నత ధర్మాసనం విచారించనుంది.
ఏపీ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోగ్య శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడకుంటా డిసిషన్ ఎలా తీసుకుంటారని గట్టిగా వాదించనుంది. ఈసీ తరఫున అటార్నీ జనరల్ వాదనలు వినిపించే అవకాశం ఉంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుందని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణ, రద్దు, వాయిదా నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదని చెప్పారు. కానీ రమేశ్ కుమార్ మాత్రం రాష్ఠ్రంలో లేని వైరస్ను బూచీగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనకు లభించిన స్వేచ్ఛ, రాజ్యాంగబద్ధ అధికారాలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఆదివారం వాయిదావేస్తున్నట్టు ప్రకటించడంతో వివాదం రాజుకుంది. వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు. అధికార పార్టీ నేతలు రమేశ్ కుమార్.. చంద్రబాబు చెప్పినట్టు నడుచుకొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. వైరస్ ప్రబలుతుంటే ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు.. అధికార వైసీపీ నేతల తీరును తప్పుపట్టిన సంగతి తెలిసిందే.