ఏపీ సర్కార్ కు సుప్రీం షాక్: ఇంగ్లిష్ మీడియం విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టేఇచ్చేందుకు నిరాకరణ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం... తాజాగా సీఎం జగన్ మానసపుత్రికగా ఉన్న ఇంగ్లీష్ మీడియం బోధన పై కూడా ఆసక్తికర ఆదేశాలు ఇచ్చింది.
ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
1వ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 85 గతంలో హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన విద్యాహక్కు చట్టంలో ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
విద్యాబోధన ఇంగ్లీష్ మీడియంలో జరగాలన్న ప్రభుత్వం నిర్ణయం ప్రగతిశీల నిర్ణయంగా అభివర్ణించారు విశ్వనాథన్. అంతేకాదు తెలుగు మీడియంలో బోధించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపడం లేదని దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం గణనీయంగా పడిపోయిందన్న విషయాన్ని విశ్వనాథన్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే విద్యార్థులు తమకు నచ్చిన మీడియంను ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేస్తోందని ప్రతివాదుల తరపు వాదనలు వినిపించారు మరో సీనియర్ న్యాయవాది శంకర్ నారాయణ్. తెలుగు మీడియం పాఠశాలలను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు శంకర్ నారాయణ్.
ఇరువర్గాల వారి వాదనలు విన్న న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. అయితే నోటీసులతో పాటుగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని ధర్మాసనంను కోరారు ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది విశ్వనాథన్. ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసేందుకు రెండువారాలు గడువు ఇచ్చిన అత్యున్నత ధర్మాసనం... ఆ తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.