జగన్కు దూరం..!: చంద్రబాబు క్యాంప్ ఆఫీస్కు సూరీడు, ఎందుకు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వద్దకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు వచ్చారు. గురువారం నాడు ఆయన విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరీడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. వైయస్ ఆయనకు ఎంతో ప్రాధాన్యతం ఇచ్చేవారు. ఎవరికైనా ఏమైనా వైయస్ వద్ద పని కావాలంటే.. సూరీడును కలిస్తే పని పూర్తవుతుందనే విధంగా వారి మధ్య సాన్నిహిత్యం ఉండేదంటారు.
మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు.. వారందరి కంటే మించి సూరీడుకు వైయస్ వద్ద పలుకుబడి ఉందనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు సూరీడు ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం గమనార్హం. గతంలో సూరీడు నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు.
జగన్కు దూరంగా.. బాబుకు దగ్గరగా?
వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు అయిన సూరీడు... ఆయన మృతి అనంతరం వైసిపి అధినేత జగన్ వెంట మాత్రం లేరు. ఆయన జగన్కు దూరం పాటిస్తూ వచ్చారనే చెప్పవచ్చు. గతంలో వైసిపి నుంచి ఇతర పార్టీలలోకి వెళ్లిన కొండా సురేఖ వంటి వాళ్లు.. సూరీడు ప్రస్తావన తీసుకు వచ్చిన సందర్భాలున్నాయి.
వైయస్ రాజశేఖర రెడ్డికి కొండా దంపతులు కూడా అత్యంత ఆఫ్తులని చెప్పవచ్చు. వారు కూడా వైయస్ పైన అభిమానంతో జగన్ పార్టీలో చేరి.. ఆ తర్వాత ఆయనతో పడక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు. ఆ సమయంలో కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డికి ఆప్తుడైన సూరీడు మొదటి నుంచి జగన్ పద్ధతి తెలిసే దూరం పాటిస్తూ వచ్చారని, ఆయన తమకు మొదటే చెప్పారని కొండా సురేఖ గతంలో చెప్పారు. జగన్ తీరు వల్లే సూరీడు ఆయనకు దూరంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. జగన్కు మొదటి నుంచి దూరంగా ఉన్న సూరీడు.. ఇప్పుడు చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు అనే చర్చ సాగుతోంది.
కీలక సమాచారం రాబట్టేందుకు పిలిచారా? వ్యక్తిగత పనుల కోసమా?
సీఎం క్యాంప్ కార్యాలయానికి సూరీడు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయామశమవుతోంది. ఓ వైపు రాజధానిలో టిడిపి నేతలు భూములు కొన్నారనే విషయమై జోరుగా చర్చ సాగుతుండగా.. జగన్ గురించి కీలక సమాచారం ఏదైనా రాబట్టేందుకు సూరీడును టిడిపి పిలిచిందా? లేక అతనే వ్యక్తిగత పనుల మీద వచ్చారా? అనే చర్చ సాగుతోంది.
జగన్ గురించి లోతైన, రహస్య విషయాలు తెలుసుకునేందుకు టిడిపి నేతలు పిలిచి ఉండవచ్చుననే అంశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. జగన్ గురించి మరింత కూపీ లాగేందుకే కావొచ్చంటున్నారు. సూరీడు ద్వారా జగన్కు చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నారా? అనే చర్చ సామాన్యుల్లోను జరుగుతోంది.