విచిత్రం:ట్రేలో పుట్టిన కోడిపిల్ల...పొదగకుండానే పుట్టింది
అంతకంతకూ పెరిగిపోతున్న అధిక ఉష్ణోగ్రత చిత్రవిచిత్రాలకు కారణమవుతోంది. కర్నూలు జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ఇలా బాగా పెరిగిన ఎండ తీవ్రత కారణం గానే జరిగిందంటున్నారు. ఇంతకూ కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఆ విచిత్ర ఘటన ఏంటంటే...
వంట కోసమని గుడ్లు కొనుక్కొచ్చి ఇంట్లోని ట్రేలో ఉంచితే దాని నుంచి కోడి పిల్ల చప్పుడు చేసుకుంటూ బైటకు రావడం...దీంతో అవాక్కవడం ఆ ఇంటి వారి వంతయింది. పైగా ఈ కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉండటం మరో విశేషం..వివరాల్లోకి వెళితే...
కర్నూలు జిల్లా వెల్దుర్తి పరిధిలోని ఐజీ నగర్లో నివాసముంటున్నరిటైర్డ్ కానిస్టేబుల్ ఎల్లప్ప వంట అవసరాల నిమిత్తమని రెండు రోజుల కిందట కోడిగుడ్లను కొనుగోలు చేశారు. ఆ తరువాత వాటిని ఇంట్లో ఉన్న ఒక ట్రేలో ఉంచారు. అయితే ఆదివారం ఉన్నట్టుండి ఆ ట్రే నుంచి ఒక కోడిపిల్ల శబ్దం చేసుకుంటు బయటకు వచ్చింది. దీంతో ఇంట్లో వాళ్లు మొదట కంగారు పడినా ఆ తరువాత విషయం అర్థమై ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.
నాటుకోడి గుడ్లను తల్లి కోడి సహజమైన వాతావరణంలో పొదిగినా లేక ఆ గుడ్లను అనువైన ఉష్ణోగ్రత, పరిశుద్ధ వాతావరణం ఉన్న చోట పొదిగించడం ద్వారా 21 రోజుల తర్వాత కోడి పిల్ల వస్తుందని పశు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ఈ నాటు కోడి గుడ్డులోని పిల్లకు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు పొదుగుడు లాంటి వాతావరణం ఏర్పరచడం వల్ల ఇలా గుడ్డు నుంచి పిల్ల బయటపడతాయని అన్నారు. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగానే జరుగుతాయని తెలిపారు.