కాల్ మనీలో అవాక్కయ్యే విషయాలు: కాల్ లిస్ట్లో మహిళల నెంబర్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్మనీ సెక్స్రాకెట్ కేసులో అవాక్కయ్యే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన యలమంచిలి రాము, దూడల రాజేష్ల పోలీసు కస్టడీ ముగిసింది. గత ఆరు రోజులుగా నిందితులు మాచవరం పోలీసుల కస్టడీలో ఉన్నారు. కాల్మనీ ఇస్తూ బాధిత మహిళల పట్ల లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలపై ఇప్పటికే ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
ఈ వ్యవహారంలో బడా వ్యక్తులే భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పెట్టుబడుల్లో కొందరు అధికారులకూ వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కాల్మనీ సెక్స్ రాకెట్ బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లు వినికిడి. ఈ ఆరు రోజుల పాటు నిందితులిద్దరిని విచారించిన పోలీసులు వారి నుంచి కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు యలమంచిలి రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీను, ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీరు ఎం సత్యానందం, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ళ శ్రీకాంత్, దూడల రాజేష్లపై మాచవరం పోలీసులు చీటింగ్, అత్యాచారంతోపాటు పలు కేసులు నమోదు చేశారు. వీరిలో రాము, రాజేష్, భవానీశంకర్లను అరెస్టు చేశారు. ఆ తర్వాత రాము, రాజేష్లను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. దీనిలో భాగంగా నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిపిన విచారణలో కేసుకు సంబంధించి అవసరమైన విలువైన సమాచారం పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధానంగా ట్రాన్స్కో డిఇ సత్యానందం కీలక పాత్ర వహించినట్లు, ఇతని ద్వారా పలువురు అధికారులు బినామీల కింద కోట్లు పెట్టుబడులు పెట్టి తద్వారా కాల్మనీపై వచ్చే ఆదాయంలో భారీగా వాటాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు నిందితుల కాల్ జాబితా పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నట్లు సమాచారం. కాల్లిస్టులో చాలామంది మహిళల ఫోన్నెంబర్లు, వారి సమాచారం ఉన్నట్లు గుర్తించారు. అయితే వారిని విచారించేందుకు పిలిస్తే కుటుంబాల్లో కల్లోలం రేగుతుందని పోలీసులు వెనుకడగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ ప్రిన్సిపాల్కు సత్యానందం కారు
ప్రస్తుతం ప్రభుత్వ అధికారిగా ఉన్న ఓ ప్రిన్సిపాల్కు డిఇ సత్యానందం ద్వారా ఈ రాకెట్తో సంబంధాలున్నట్లు ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు రాకెట్పై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ముందుగానే పసిగట్టిన సత్యానందం పరారయ్యే క్రమంలో తన నలుపు రంగు కారును ఈప్రిన్సిపాల్కు ఇచ్చినట్లు అతని కారులో సత్యానందం తప్పించుకుని పోలీసులను దృష్టి మరల్చినట్లు చెబుతున్నారు.
ఆ తర్వాత సదరు ప్రిన్సిపాల్ నుంచి పోలీసులు నలుపు రంగు కారు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రిన్సిపాల్ను విచారించకుండా వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంకా కొందరు అధికారులతోపాటు, విద్యుత్ శాఖలోనే ఉన్నతస్థాయి అధికారుల సంబంధాలపై కూడా ఆరోపణలు వినిపిస్తుండటంతో పోలీసులు ఈ దిశగా ఆరా తీస్తున్నారు.
రంగంలోకి దిగేది ఇతనే
కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో బౌన్సర్గా పోలీసులు అరెస్టు చేసిన పోలురౌతు భవానీశంకర్ వరప్రసాద్ అరాచకాలు అంతా ఇంతా కాదని పోలీసులే చెబుతున్నారు. భవానీ శంకర్ ప్రధాన నిందితుడు రాము వద్ద పని చేస్తున్నాడు. అప్పులు తీసుకున్న వారు వడ్డీలు చెల్లించకపోతే ఈబౌన్సర్ రంగంలోకి దిగుతాడు. భర్తలు లేనప్పుడు నేరుగా వారి ఇళ్ళకు వెళ్లి తన ఇష్ట వచ్చినట్లు ప్రవర్తిస్తాడు.
ఇంట్లో తనకు కావాల్సింది తీసుకుని తినడమే కాకుండా వికృత చేష్టలతో చుట్టుపక్కల వారి దృష్టిలో బాధితులను చులకన చేస్తూ దుర్భాషలాడటం, మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించ వంటి అరాచకాలకు పాల్పడుతుంటాడని, ఈక్రమంలోనే వారిపై లైంగిక దాడులకు కూడా ఈ ముఠా ఉప్రకమిస్తుందని, ఒక దశలో పరువుకోసమైనా కొందరు మహిళలు ఈ ముఠాకు లొంగిపోయారనే ప్రచారం కూడా ఉంది.