తిరుమలలో టీటీడీ కొత్త ఈఓ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో.. !!
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 69,842 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 28,234 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.18 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.
బ్రహ్మోత్సవాల గడువు సమీపించిన నేపథ్యంలో టీటీడీ కొత్త కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్.. నేడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూమ్, క్యూ లైన్లు, కంపార్ట్ మెంట్లు, లగేజీ గదులు, వసతి రూములు, వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్,.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఆయన మెరుపు తనిఖీలను చేపట్టారు. భక్తులు, శ్రీవారి సేవకులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు ఈఓ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోజు రోజుకూ మారుతున్న టెక్నాలజీని అనుసరించి నూతన సాఫ్ట్వేర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. తిరుమలలో మిస్సింగ్ పర్సన్స్ గుర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తిరుమలలోని ప్రతి అంగుళాన్ని మానిటర్ చేయగల విధంగా సిబ్బందిని నియమించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. రియల్ టైమ్లో వ్యక్తుల గుర్తింపు, ఘటనలపై నిఘా కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను వినియోగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో ఎల్ అండ్ టీ సిబ్బందితో కూడా టెక్నాలజీ వినియోగంపై చర్చించారు. వారికి కొన్ని సూచనలను ఇచ్చారు. క్యూలైన్లల్లో భక్తుల రద్దీ, శీఘ్రగతిన శ్రీవారి దర్శనం వంటి అంశాలపై మాట్లాడారు.
అనంతరం ఈవో లగేజీ కౌంటర్ను పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు. దర్శన టోకెన్ పొందిన సమయం, దర్శనం పూర్తైన సమయాలను వాకబు చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రీవారి దర్శనం టీటీడీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 కు చేరుకుని భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులతో మాట్లాడారు. భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చి తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీపీఆర్వో డాక్టర్ టీ.రవికి సూచించారు.
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దేవాదాయశాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్, బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణు శనివారం శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు.












Click it and Unblock the Notifications