టిడిపిని 'నందమూరి' ఫ్యామిలీకి అప్పగించు: నాని, అధికారులకు వార్నింగ్
తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతగా పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావని వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం నాడు విమర్శించారు.
గుంటూరు: తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతగా పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావని వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం నాడు విమర్శించారు. జగన్ రైతు దీక్ష ప్రాంగణంలో ఆయన మాట్లాడారు.
ఉప ఎన్నిక షాకింగ్: ఓటుకు రూ.7వేలు: గుడివాడ కొడాలి నాని వర్సెస్ రావి
జగన్పై తన మంత్రులు, చెంచాలు, పకోడీ గాళ్లను పెట్టించి చంద్రబాబు తిట్టించే కార్యక్రమం చేస్తున్నారని నాని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్కు భయపడి వచ్చారు
వైయస్ జగన్పై అవాకులు, చెవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్కు భయపడి పారిపోయి ఏపీకి వచ్చారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్కు వెన్నుపోటి పొడిచి టిడిపి ఆక్రమణ
స్వర్గీయ నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఆక్రమించుకున్నారన్నారు. కానీ జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చారని, సొంతగా పార్టీ పెట్టి ప్రతిపక్ష నేత అయ్యారన్నారు.
లోకేష్పై సెటైర్లు
జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తిని తీసుకు వచ్చి మంత్రిని చేశారని నారా లోకేష్ను ఉద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆ మంత్రి నీటి సమస్యను పరిష్కరించడం కాదని, సృష్టిస్తానని చెప్పడం విడ్డూరమన్నారు.
అధికారులూ! ఒళ్లు దగ్గర..
టిడిపి నేతలతో పాటు కొంతమంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని, జగన్ సీఎం అయితే చంద్రబాబు ఇక్కడి నుంచి పారిపోతారని కొడాలి నాని అన్నారు. టిడిపి ప్రభుత్వాన్ని చూసి రెచ్చిపోయే అధికారులు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలని హెచ్చరించారు.
నందమూరి కుటుంబానికి పార్టీ ఇచ్చేసి..
దివంగత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి ఇచ్చేయాలని నాని సూచించారు. చంద్రబాబు పార్టీ పెట్టుకోవాలని, అప్పుడు ఆయనకు డిపాజిట్లు కూడా రావన్నారు.
కాగా, కొడాలి నాని నటుడు జూనియర్ ఎన్టీఆర్కు సన్నిహితులు. అయిదారేళ్ల క్రితం టిడిపిలో వారసత్వ పోరు జరిగిన సమయంలో నాని.. జూనియర్ వైపు ఉన్నారు. ఆ తర్వాత లోకేష్ తెరపైకి రావడం, 'జూనియర్' వాదన తెరమరుగు కావడం, నాని వైసిపిలో చేరడం జరిగింది.
లోకేష్ను అప్రకటితంగానైనా వారసుడిగా తెరపైకి తీసుకు రావడంపై హరికృష్ణ కూడా పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొడాలి నాని.. నందమూరి ఫ్యామిలికీ పార్టీని అప్పగించాలని వ్యాఖ్యానించడం గమనార్హం.
జూనియర్ మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే, చాలామంది మాత్రం టిడిపి భావి వారసుడు ఆయననే అని భావించే వారు లేకపోలేదు. అయితే, ఎప్పటికైనా ఆయన రాజకీయాల్లోకి వస్తారనే వాదన ఉంది.