సిఎం సొంత నియోజకవర్గంలో 'సర్వే' కలకలం:ఉద్రిక్తత;ఎవరి కోసం?
చిత్తూరు:చిత్తూరు జిల్లాలోని సిఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక సంస్థ నిర్వహిస్తున్న సర్వే ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. సర్వే నిర్వహిస్తున్న వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తుండటమే ఇందుకు కారణం.
దీంతో ఈ సర్వే నిర్వహిస్తున్నవారు అసలు ఎవరి కోసం దీన్ని చేపట్టారో అనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీయే ఈ సర్వే చేయిస్తోందని టిడిపి శ్రేణులు అనుమానిస్తుండగా అధికార పార్టీయే ఈ సర్వే జరిపిస్తోందని వైసిపి వర్గాలు వాదిస్తున్నాయి. అధికార పార్టీ సర్వే కాబట్టే నిర్వాహకులు అంతలా దబాయిస్తున్నారని వైసిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.
కుప్పంలో జరుగుతున్న సర్వేలో జనాల వ్యక్తిగత అవసరాలు, ప్రయోజనాలతోపాటు, స్థానిక నాయకుల పనితీరు, ఓట్ల సరళి గురించి కూడా సవివరంగా పొందుపరిచేందుకు నిర్వాహకులు పూర్తి వివరాలు అడుగుతున్నారు. దీంతో ఈ వివరాలన్నీ మీకు దేనికనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలా ఎవరైనే ప్రశ్నిస్తే సర్వే నిర్వాహకులు అదంతా మీకెందుకు అడిగిన వాటికి సమాధానం చెప్పాలని దురుసుగా బదులిస్తున్నారట. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయట.
అయితే పికె గ్రూప్ ద్వారా వైసిపి నే ఇతర ప్రాంతాల నుంచి యువ బృందాలను తీసుకొచ్చి ఈ సర్వే నిర్వహిస్తోందని స్థానిక టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ విధంగా సర్వే జరపడం ద్వారా తప్పుడు సమాచారాన్నిసేకరించి ఎన్నికల నాటికి అధికార పార్టీకి అప్రదిష్ట తేవాలనే కుట్రతో వైసిపి ఆ విధంగా చేస్తోందంటూ టిడిపి శ్రేణులు వాదించడంతో పాటు పార్టీ సంబంధింత వాట్సప్ గ్రూపుల్లో ఆ మేరకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లుగా తెలిసింది.
అయితే అసలు అధికార పార్టీనే ఈ సర్వే నిర్వహిస్తోందని, రాజగోపాల్ కు చెందిన లేదా ఆయన ఆధ్వర్యంలో నడిచే సంస్థల ద్వారా టిడిపినూ ఈ సర్వే జరిపిస్తూ ఉండవచ్చనేది వైసిపి నేతల అనుమానిస్తున్నారు. ఇటీవలే రాజగోపాల్ సిఎంని కలవడం గురించి గుర్తుచేస్తున్నారు. మరోవైపు కుప్పంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకున్న పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఎటు చూసినా ఎన్నికలు అతి సమీపంలోకి వచ్చేశాయా అన్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ వేడి చాలదన్నట్లుగా కొద్ది రోజుల క్రితమే యువకులతో కూడిన కొన్ని బృందాలు ఈ నియోజకవర్గంలో దిగిపోయి హడావుడి చేస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ట్యాబ్లు చేతబట్టి పల్లెబాట పట్టిన ఈ యువజనాలు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ ఏ ఇంటినీ వదలకుండా సర్వే నిర్వహిస్తున్నాయి. గ్రామ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యల గురించి కూడా ప్రశ్నలు సంధించి స్థానికుల నుంచి సమగ్ర వివరాలు రాబట్టడం, అప్లోడ్ చేయడం చేస్తున్నాయని తెలిసింది.
అంతేకాక ఎమ్మెల్యే, సీఎం పనితీరు, స్థానిక నాయకత్వం వ్యవహారశైలి, సీఎం ఎవరైతే బాగుంటుంది తదితర ప్రశ్నలన్నింటినీ అడిగి మరీ ట్యాబ్లలో నిక్షిప్తం చేస్తు న్నాయి. పోలింగ్ బూత్కు ఇద్దరు చొప్పున యువకులు సర్వే చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి రోజుకు వెయ్యి రూపాయల వంతున సంబంధిత ఏజన్సీ చెల్లిస్తోందని తెలిసింది. అసలే రాజకీయ హడావుడి ప్రారంభమైన నేపథ్యంలో ఈ సర్వేలు నియోజకవర్గంలో కొద్దిపాటి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి.
సర్వే బృందాల్లోని కొందరు యువకులు ఇళ్లకు వెళ్లి దౌర్జన్యకరమైన రీతితో ప్రశ్నలు వేయడంతో గ్రామాల్లో జనం తిరగబడుతున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీ ఈ సర్వే చేయిస్తున్నదన్న ప్రచారం జరుగుతుండడంతో అధికార పార్టీలోని కార్య కర్తలు అప్రమత్తమవుతున్నారు. సర్వే బృందాలకు సహకరించరాదంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్లు పోస్ట్ అవుతున్నాయి. సర్వే పేరుతో ముఖ్య మంత్రి నియోజకవర్గంలో అధికార పార్టీకి అప్రదిష్ట తేవడానికి ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తున్నదంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
అయితే ఈ సర్వే ఎవరికి చెందినదని నేరుగా సర్వే నిర్వాహకులనే ప్రశ్నస్తే మాత్రం తాము అధికార పార్టీ తరఫునే సర్వే చేస్తున్నట్లుగా చెబుతున్నారట. దీనిపై టిడిపి మద్దతుదారులు స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీ తరఫున అని చెబితే వ్యతిరేకతతో సర్వేకు సహకరించరనే వారు అలా సమాధానం చెబుతున్నారనేది వారి వాదన. ఏదేమైనా ప్రస్తుతం సిఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరుగుతున్న ఈ సర్వే ఎవరు చేయిస్తున్నారనేది తేలని పక్షంలో పలు అనుమానాలతో ఉద్రిక్తతలు మరింత పెరిగి చివరకు అవి గొడవలకు దారితీసినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.