సర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది: రాజధానిగా అమరావతి గుర్తింపు లేదంటూ: అసలు కారణం ఏంటంటే..!
అమరావతి పైన సర్వే ఆఫ్ ఇండియా మరో విషయం బయట పెట్టింది. అమరావతిని ఏపి రాజధానిగా గుర్తిస్తూ నోటీఫికేషన్ జారీ చేయలేదని తేల్చింది. దాని కారణంగానే ఇండియా నూతన పొలిటికల్ మ్యాప్ లో అమరావతిని రాజధానిగా ప్రస్తావించలేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గతంలో ఆ శాఖను పర్యవేక్షించిన మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేసారు.
ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన ఈ అంశం మీద స్పందించారు. తాను సర్వే ఆఫ్ ఇండియాను సంప్రదించగా ఈ విషయం చెప్పారని వివరించారు. అమరావతిని రాజధానిగా నోటిఫికేషన్ ఇవ్వకపోవటం చంద్రబాబు వైఫల్యంగా ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి మిస్ కావటం పైన ఇప్పుడు ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే, నాడు చంద్రబాబు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు.
అమరావతికి స్థానం లేకుండా...
తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కల్పించలేదు. దీని పైన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కీలక విషయాలను బయట పెట్టారు. తాను ఇదే అంశం మీద సర్వే ఆఫ్ ఇండియాతో సంప్రదించగా వారిచ్చిన సమధానం ఏంటో బయట పెట్టారు. అమరావతిని రాజధానిగా నోటిఫికేషన్ జారీ చేయకపోవటంతో..గుర్తింపు ఇవ్వలేదని చెప్పినట్లుగా ఆయన తేల్చి చెప్పారు. అది చంద్రబాబు వైఫల్యంగా తేల్చారు.
గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా అమరావతికి అడ్రస్ లేకుండా చేసారు. నాడు అయిదేళ్ల కాలంలో చంద్రబాబు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇక, కొద్ది రోజులుగా జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వంలోని మంత్రులు రాజధాని మీద అస్పష్టంగా వ్యవహరిస్తున్నారు. రాజధాని మీద కమిటీ ఏర్పాటు చేసారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు..ఇప్పటి ప్రభుత్వం ఇవ్వకూడదా అనే ప్రశ్న తలెత్తుతే..ప్రస్తుత ప్రభుత్వం నిపుణుల కమిటీ సూచనల మేరకు నడుచుకుంటామని చెబుతోంది.
భారతదేశ మ్యాప్ లో అమరావతి మిస్..
తాజాగా కేంద్రం ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ము కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. అందులో అన్ని రాష్ట్రాల రాజధానులను గుర్తించింది. అయితే, అమరావతికి మాత్రం గుర్తింపు లేదు. దీని పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇది చంద్రబాబు నోటిఫికేషన్ ఇవ్వకపోవటం వలన ఏర్పడిన సమస్యగా వైసీపీ చెబుతోంది. తాజాగా సుజనా చౌదరి అదే విషయాన్ని స్పష్టం చేసారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆరోపిస్తున్నారు.
ఇక, ఇప్పటి వరకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెబుతూ వస్తున్న వైసీపీ ప్రభుత్వం తాము అయినా నోటిఫికేషన్ ఇస్తారా అంటే అందుకు సిద్దంగా ఉన్నట్లుగా కనిపించటం లేదు. దాదాపు అయిదేళ్ల క్రితమే అమరావతి ఏపీ రాజధానిగా ఖరారు చేయటం..ప్రధానితో నగర నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగింది. అయినా..ఇప్పటి వరకు నోటిఫికేన్ మాత్రం ఎందుకు విడుదల చేయలేదంటే..దాని వెనుక అసలు కారణాలు మాత్రం ఎవరూ బయట పెట్టటం లేదు.
నిపుణుల కమిటీ ఆధారంగానే..
వైసీపీ ప్రభుత్వం ఇప్పటికి పలు మార్లు ఇదే నోటిఫికేషన్ చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. కానీ, తాము నోటిఫికేషన్ ఇస్తామని మాత్రం చెప్పటం లేదు. రాష్ట్ర విభజన జరిగి అయిదేళ్లు పూర్తయింది. నోటిఫికేషన్ లేదు..కేంద్ర గుర్తింపుల లేకుండానే అమరావతిని అంతర్జాతీయ నగరం అని..వరల్డ్ క్లాస్ కేపిటల్ అంటూ ఊదరగొట్టారు.
రాజధానిగా రాష్ట్ర ప్రజలు అందరూ ఫిక్స్ అయిన తరువాత ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్తగా అధ్యయనం పేరుతో నిపుణుల కమిటీ వేసింది. వారు రాజధానితో పాటుగా నగరాలను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని..దాని అనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ అయిన రాజధాని విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వటంతో ఉద్దేశ పూర్వకంగానే దాటవేత ధోరణితో వ్యవహరిస్తోంది. ఇక, టీడీపీ నేతలు రాజధానిలో ఇప్పటి వరకు చేసిన ఖర్చు..వాస్తవాల అధ్యయనం కోసం పర్యటించాలని నిర్ణయించారు. దీంతో..రాజకీయాల్లో చిక్కకున్న అమరావతి గుర్తింపు వ్యవహారం పైన ఇంకా ఎక్కవ కాలం సాగదీస్తే ఇది రాజకీయంగా ఎలా ఉన్నా..ప్రజలు మాత్రం స్పష్టత కోరుకుంటున్నారు.