ఏపీలో ఆర్టీసీ స్థలాలపై సర్వే .. జగన్ సర్కార్ కీలక నిర్ణయం వెనుక మతలబు ఇదేనా ?
ఏపీలోని వైసిపి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆర్థికంగా డీలా పడిన ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న ఏపీ సర్కార్, ఆదాయ వనరుల అన్వేషించే పనిలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కమర్షియల్ గా ఆర్టీసీకి ఉపయోగపడే స్థలాలపై సర్వే చేయించటంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను తవ్వితీసే పనిలో పడింది .
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో .. కేసీఆర్ నే అడగాలన్న మంత్రి పేర్ని నాని
ఆర్టీసీ ఆదాయ మార్గాలపై అన్వేషిస్తున్న సర్కార్
ఏపీఎస్ఆర్టీసీ... ఆర్థికంగా వెనుకబడిన ఆర్టీసీని ఆదుకోవడానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ ఆదాయవనరులు పెంచడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. అంతకుముందే ఆర్థిక నష్టాలలో ఉన్న ఆర్టిసి ఇప్పుడు కరోనా కారణంగా పీకల్లోతు నష్టాల్లోకి, కష్టాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో రెగ్యులర్ గా వచ్చే ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ఇక అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడకపోవడంతో తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీ బస్సు సర్వీసుల రవాణా ద్వారా వచ్చే ఆదాయం లేకుండా పోయింది.
ఆర్టీసీ స్థలాల సర్వే .. ఆదాయాన్ని పెంచే ప్లాన్ లో భాగంగా
ఈ క్రమంలో ఆర్టీసీని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం ఎలా ఆలోచిస్తున్న సర్కార్ ఆ దిశగా ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ సొంత స్థలాలను సర్వే చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆర్టీసీ స్థలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆర్టీసీ ఉన్న స్థలాలను సర్వే చేసి వాటిని ఏవిధంగా వినియోగించుకోవచ్చు అనే రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించనుంది.
వాణిజ్యపరంగా ఉపయోగపడే స్థలాలను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ కి 13 జిల్లాలలో 1900 ఎకరాల స్థలాలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఆర్టీసీ స్థలాలను వాణిజ్యపరంగా వినియోగించుకుంటే ఆదాయం పెరుగుతుందని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే స్థలాలను సమగ్రంగా సర్వే చేయించడంతో పాటు గా వాటి టైటిల్ డీడ్స్, డాక్యుమెంట్లను కూడా పరిశీలించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ లు ఆర్టిసి స్థలాలపై దృష్టిసారించి సర్వే చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాలో ఆర్టీసీలో జరిగిన అక్రమాలపై కూడా నజర్
సర్వే పూర్తి చేసి వాణిజ్యపరంగా ఉపయోగించుకోడానికి అనుకూలంగా ఉన్న భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ప్రభుత్వం ఆ దిశగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడానికి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది.
ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఆర్టీసీ భూముల విషయంలో ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయి అనే కోణంలో కూడా ప్రభుత్వ ఆరా తీస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములకు సంబంధించి చాలావరకూ అవకతవకలు జరిగినట్లుగా అనుమానిస్తున్న ప్రభుత్వం ఆ కోణంలో కూడా ఆర్టీసీ స్థలాలపై దృష్టి పెట్టింది.
ఆ జిల్లాలలో ఆర్టీసీలో అక్రమాలను గుర్తించిన సర్కార్
ముఖ్యంగా గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలలో అక్రమాలు జరిగాయని సర్కార్ భావిస్తోంది. ఒకవైపు ఆర్టీసీ భూముల సర్వే చేపడుతూ, ఆర్టీసీ ఆదాయవనరులు పెంచే ఆలోచన చేస్తూనే, మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టిన సర్కార్ ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ పైన కూడా దృష్టి పెట్టటం ఆందోళన కలిగిస్తుంది .