కాంగ్రెస్పై సుష్మా ఫైర్: కెసిఆర్ భయపడ్డారన్న ఇంద్రసేనా
మెదక్/నల్గొండ: తమ పార్టీ ఒత్తిడి వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. ఆమె శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ లోనిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చినట్లు చెప్పుకునే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని సుష్మా స్వరాజ్ అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని తెలిపారు. తెలంగాణలో యువకుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని సుష్మా స్వరాజ్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి కె చంద్రశేఖర్ రావు భాష బాధ్యతారాహిత్యంగా ఉందని ఆమె మండిపడ్డారు.
ఓటమి భయంతోనే కెసిఆర్ ఆరోపణలు: ఇంద్రసేనారెడ్డి
నల్గొండ: ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తిట్ల పురాణం చదువుతున్నారని భువనగిరి లోకసభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా చౌటుప్పల్లో జరిగిన భారత్ విజయ్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జాతీయ నాయకులపై కెసిఆర్ అన్ పార్లమెంటరీ భాష ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.
తిట్ల పురాణంలో కెసిఆర్ పిహెచ్డి చేసినట్టుందని ఇంద్రసేనారెడ్డి ఎద్దేవా చేశారు. తమ పార్టీతో పొత్తు కుదరలేదనే అక్కసుతోనే బిజెపిని మతతత్వ పార్టీ అని దూషిస్తున్నారని, నాయకులపై అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. కెసిఆర్ మాటలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు.
తెలంగాణ ప్రజల గౌరవం దృష్ట్యా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపిని మతతతత్వ పార్టీని అని ఆరోపిస్తున్న కెసిఆర్.. ఇరాక్ సంతతికి చెందిన ఓవైసీని ఎత్తుకుని మోస్తున్నారని విమర్శించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్న కెసిఆర్ మతతత్వ వాది అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఇంద్రసేనారెడ్డి అన్నారు.