వైఎస్ జగన్ అంటే సుష్మాస్వరాజ్ కు ఆప్యాయత: భయానకంగా హింసించారంటూ కాంగ్రెస్ పై నిప్పులు
Recommended Video
న్యూఢిల్లీ: ఎవ్వరికీ తెలియని కోణం. తాజాగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర మాజీమంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల గురించి ఆమె తరచూ ప్రస్తావించేవారు. ప్రత్యేకించి- వైఎస్ జగన్ అంటే ఆప్యాయత చూపించేవారు. కుమారుడిలా చూసుకునే వారని చెబుతుంటారు. ఈ విషయం ఏనాడూ పెద్దగా బయటికి రాలేదు గానీ.. వైఎస్ జగన్ పై సీబీఐ కేసులు నమోదు చేయడాన్ని సుష్మాస్వరాజ్ నిండు సభలో తప్పుపట్టారు. ఏ పాపం చేశాడని వైఎస్ జగన్ పై కేసులు నమోదు చేశారు. వైఎస్ జగన్ ను భయానకంగా హింసించారని ఆమె కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది.
ప్రతిపక్ష నేతగా.. కాంగ్రెస్ పై నిప్పులు
2009 ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 100 రోజుల్లోపే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. అదే సమయంలో లోక్ సభలో సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పై విమర్శలు చేయాల్సిన సందర్భంలో ఆమె వైఎస్ జగన్ అక్రమ కేసుల విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మనస్తత్వం ఎలాంటిదో, ఆ పార్టీ నాయకుల వైఖరి ఎలాంటిదో ఓ భయానక ఉదాహరణను చెబుతానంటూ సుష్మాస్వరాజ్.. వైఎస్ జగన్ పై నమోదైన ఆస్తుల కేసుల వ్యవహారంపై సభలో మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి, వైఎస్ జగన్ పై అక్రమంగా కేసులు నమోదు చేయించారని, ఆయన కుటుంబంపై పగ సాధిస్తున్నారంటూ సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.
సొంత పార్టీకి చెందిన యువనేతను హింసించలేదా?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్నారని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రె్ ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం అంటే ప్రాణం ఇచ్చేవారని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో పోల్చుకుంటే వైఎస్సార్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకులను అధికంగా అభిమానించే వారని అన్నారు. అలాంటి నాయకుడి కుమారుడిని కాంగ్రెస్ పార్టీ భయానకంగా హింసించిందని అన్నారు. పార్టీలో కొనసాగితే ఒక రకంగా.. పార్టీని వీడితే ఇంకోరకంగా చూస్తుందని ఇదీ ఆ పార్టీ తీరు అని సుష్మాస్వరాజ్ సభలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుష్మాస్వరాజ్ కన్నుమూసిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేశారు. ఆమెకు నివాళి అర్పిస్తున్నారు.
కన్నుమూసిన ఉక్కు మహిళ
భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఆమెకు భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బాన్సురి ఉన్నారు. స్వరాజ్ కౌశల్ క్రిమినల్ లాయర్. రాత్రి 10.15 నిమిషాల సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. చికిత్స చేస్తోన్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు కేంద్ర మంత్రులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆమె మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు.