సస్పెన్స్థ్రిల్లర్గా సాగుతున్న ఏపీ కేబినెట్ వ్యవహారం ! సీఎస్ హాజరుపై మరో సారి ఉత్కంఠ!
అమరావతి/హైదరాబాద్ : ఎన్నికల నోటిఫికేషన్ ఏ ముహూర్తంలో విడుదలైందో గాని.. అప్పటి నుండి ఏపి రాజకీయాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి, సీఎస్ ఎల్బీ సుబ్రమణ్యం మధ్య తారస్థాయిలో పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు వర్గాలు ఉప్పు.. నిప్పులా అధికారిక వ్యవహారాల్లో తలపడుతున్నాయి. ముందుగా మంత్రులు చేసే సమీక్షలకు అధికారులు కనీసం హాజరయ్యేవారు కాదు. సీఎం చంద్రబాబును ఇప్పటివరకు సీఎస్ కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించనేలేదు. తుపాను వచ్చినప్పుడు కలిసి పరిస్థితిని వివరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాను ఎన్నికల సంఘం పరిధిలో ఉండటంతో చంద్రబాబుకు తాను జవాబుదారీ కాదన్నట్లుగా సీఎస్ వ్యవహరిస్తున్నారు. దీంతో చంద్రబాబు, ఎల్వీ సుబ్రమణ్యం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఏపీ కేబినెట్ భేటీకి సీఎస్ వెళతారా..? ఉత్కంఠ రేపుతున్న కేబినెట్ భేటీ..!!
ఎల్వీ సుబ్రమణ్యంను తన ముందుకు రప్పించుకోవాలని చంద్రబాబు మాస్టర్ప్లాన్ వేశారు. ఏకంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నికల పోలింగ్కు, ఫలితాలకు మధ్య మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల పదో తేదీనే మంత్రివర్గ భేటీ ఉంటుందని భావించినా.. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలపై ఈసీ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉన్నందున 14వ తేదీ వాయిదా పడింది. వాస్తవానికి ఎన్నికలు జరిగాక.. ఫలితాల వెల్లడి మధ్యలో ఉన్న సమయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించడమనేది చాలా అరుదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇది జరుగుతుంది. ఏపీలో మాత్రం అలాంటి ప్రత్యేక సందర్భాలు ఉన్నాయా.. లేదా.. అన్నది పక్కన పెడితే.. రాజకీయంగా పైచేయి సాధించాలన్న తపన అటు మంత్రులు, ఇటు సీఎస్లో స్పష్టంగా కనిపిస్తోంది.
చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? అందరి ద్రుష్టి సీఈసీ నిర్ణయం పైనే..!!
ఇప్పుడు మంత్రివర్గ సమావేశం ద్వారా ఇది బహిర్గతమయ్యే అవకాశం ఉంది. మరి ఈ మంత్రివర్గ సమావేశానికి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం హాజరవుతారా.. లేదా.. అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మంత్రులు, ముఖ్యమంత్రలు నిర్వహించే కార్యక్రమాలకు వెళ్లడానికి వీలుండదు. ఇటీవల చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్లినప్పుడు జలవనరుల శాఖ కార్యదర్శి హాజరు కాలేదు. ఆయన కర్ణాటకలో ఎన్నికల అధికారిగా ఉన్నందున రాలేదు. ఇప్పుడు కూడా ఎల్వీ సుబ్రమణ్యం ఎన్నికల సంఘం తరఫున రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చక్కబెడుతున్నారు. ఎన్నికల సంఘానికి, రాష్ట్రానికి మధ్య ఆయనే వారధిగా ఉన్నారు.
ఆహ్వానిస్తే హాజరవుతానంటున్న ఎల్వీ..! కీలక వ్యాఖ్యలు చేసిన సీఎస్..!!
మరి ఈ సమయంలో మంత్రివర్గ సమావేశానికి వెళతారా లేదా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. వెళ్లకూడదన్న నిబంధన అయితే ఏమీ లేదని కూడా అధికారులు చెబుతున్నారు. అదీగాక సీఎస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సందేహాలు మరింత రెట్టింపు చేస్తున్నాయి. తనకు మంత్రివర్గ సమావేశం ఉందని కేవలం సమాచారం మాత్రమే వచ్చిందని, హాజరు కావాలని కోరలేదని చెప్పడం వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు. పిలిస్తే వెళతా తప్ప.. తనంతట తానుగా వెళ్లనని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ప్రతిమంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు కేబినెట్ నోట్ తయారు చేసి.. దానిపై అన్ని శాఖల అధికారులకు సమాచారం పంపించేది సీఎస్. ఆ తర్వాత మంత్రివర్గ భేటీలో కూడా అజెండాలోని అంశాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ చర్చ చేపడతారు. కానీ ఈసారి ఎన్నికల సమయం కావడంతో.. మరి సీఎస్ వెళతారా.. లేక ఆయా శాఖల కార్యదర్శలను పంపించి ఊరుకుంటారా.. అన్నది తేలాల్సి ఉంది.
ఈసీ అనుమతిస్తుందా..? ఏపిలో కొనసాగుతున్న ఉత్కంఠ రాజకీయం..!!
ఏపీ కేబినెట్లో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ స్క్రీనింగ్ కమిటీ ఆ అంశాలకు ఆమోదం తెలిపి.. మంత్రివర్గ నిర్వహణకు భారత ఎన్నికల సంఘానికి అజెండా నోట్ను పంపించింది. ఈసీ ఆమోదం తెలిపేందుకు 48 గంటల సమయం ఉంటుంది. మరి ఏపీ కేబినెట్ నిర్వహణకు ఈసీ పచ్చజెండా ఊపుతుందా.. లేదా కూడా తెలియాల్సి ఉంది. ఆర్థిక, విధాన పరమైన నిర్ణయాల ప్రస్తావన లేకపోవడంతో ఈసీ నుంచి పచ్చజెండా రావొచ్చనే అధికారులు భావిస్తున్నారు. అదీగాక ఇటీవల కేంద్ర మంత్రివర్గ సమావేశమై దౌత్యపరమైన అంశాలపై చర్చించింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా తుపాను, కరవు, ఉపాధి హామీ చెల్లింపులపై చర్చించనున్న నేపథ్యంలో ఈసీ నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నారు.