ఏపీలో సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా..? ఉరుకుల పరుగులు.. అసలేం జరిగింది..
ఆంధ్రప్రదేశ్లో ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం(మార్చి 3) ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్న విషయాన్ని చర్చించారు. అయితే ఇంతలోనే రాష్ట్రంలో కరోనా కలకలం రేగింది. ఇటీవల దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి కలెక్టర్కు ఫోన్
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొదట దక్షిణ కొరియా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడినుంచి కొత్తపేట మండలంలోని సొంతూరు వాడపాలెంకు చేరుకున్నాడు. మూడు రోజుల నుంచి అతను అక్కడే ఉండగా.. మంగళవారం హైదరాబాద్ నుంచి వైద్యశాఖ అధికారులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేశారు. ఇటీవల దక్షిణ కొరియా నుంచి తిరిగొచ్చిన ఓ యువకుడు తూర్పుగోదావరి వచ్చాడని.. అతనికి కరోనా సోకి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.
కాకినాడ జీజీహెచ్లో చేరిక..
వెంటనే కలెక్టర్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు వాడపాలెం వెళ్లగా అక్కడి నుంచి అతను గోదశపాలెంలోని అత్తగారింటికి వెళ్లినట్టు తెలిసింది. అక్కడినుంచి గోదశపాలెం వెళ్లిన అధికారులు సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అలాగే అతని కుటుంబ సభ్యులతో పాటు అత్తగారింట్లోని వారికి కూడా వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.
తైవాన్ వ్యక్తికి నెగటివ్..
ఇటీవల కరోనా లక్షణాలతో తిరుపతి చేరుకున్న తైవాన్ చెన్ షి షన్ అనే వ్యక్తికి వైరస్ సోకలేదని వైద్య పరీక్షల్లో నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం (ఫిబ్రవరి 29)న అతను రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మెషిన్ రిపేర్ కోసం అతను తైవాన్ నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చాడు. అప్పటికే దగ్గు,గొంతు నొప్పి,జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతనికి కరోనా సోకిందేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు తిరుపతి రుయా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు. ల్యాబ్కి పంపించిన అతని శాంపిల్స్లో నెగటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Recommended Video
24 గంటలు నిఘా..
మరోవైపు కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం,వైద్యాశాఖ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామని.. 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి ఇప్పటి వరకు 263 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారని, వారందరినీ మెడికల్ అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 211 మందికి 28 రోజుల మెడికల్ అబ్జర్వేషన్ పూర్తయిందని తెలిపారు. అనుమానంగా ఉన్న 11 మంది శాంపిళ్లను ల్యాబ్కు పంపించగా.. 10 మందికి నెగెటివ్ అని తేలిందన్నారు.