టిడిపి నుంచి సస్పెండ్...కట్ చేస్తే...సిఎం చంద్రబాబు సభలో ప్రత్యక్షం...ఎవరంటే?...
అనంతపురం: జెసి దివాకర్ రెడ్డి మాటల్లోనే కాదు చేతల్లో కాదు తాను వెరైటీ అని నిరూపించుకుంటున్నారు. టిడిపి నుంచి సస్పెండయిన తన అల్లుడు దీపక్ రెడ్డిని సిఎం చంద్రబాబు సభకు తీసుకు రావడమే కాదు ఏకంగా వేదిక మీదే కూర్చోబెట్టాడు. అనంతపురం జిల్లాలో జన్మభూమి సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
టిడీపీ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చాలా కాలం విరామం తరువాత ఆ పార్టీ నేతలకు దర్శనమిచ్చారు. అయితే ఆయన పునర్ధర్శనం చాలా ఘనంగా జరిగి టిడిపి నేతలకు మరో షాక్ లా పరిణమించింది. భూ వివాదం ఫోర్జరీ కేసులో చిక్కుకొని జైలుకు వెళ్లొచ్చిన దీపక్ రెడ్డి ఆ తరువాత చాలా కాలం పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు. అయితే ఉన్నట్టుండి ఆయన అనంతపురం జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జన్మభూమి-మా ఊరు ముగింపు సభకు హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు.
తన మామ జెసి దివాకర్ రెడ్డితో కలసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన దీపక్ రెడ్డి ఏకంగా వేదికపైనే ఆసీనులయ్యారు. హైదరాబాద్ భూకబ్జా కేసు నేపథ్యంలో ఆయనను గత ఏడాది జూన్ లో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో దీపక్ రెడ్డి సీఎం సభకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో జెసి దివాకర్ రెడ్డి మరోసారి తన స్పెషాలిటీ చాటుకున్నారని...సస్పెండైన నేతను సిఎం పక్కనే కూర్చోబెట్టి...జెసినా మజాకా అనిపించారని కామెంట్లు చేస్తున్నారు.