మున్సిపల్ పోరుపై సస్పెన్స్-నిమ్మగడ్డ అధికారాలపై హైకోర్టులో పిటిషన్లు-రీ నోటిఫై తప్పదా ?
ఏపీలో వచ్చే నెల 2 నుంచి గతంలో ఆగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. అసలు గతంలో ఆగిన చోట నుంచే ఎన్నికలను తిరిగి ప్రారంభించే అధికారం ఆయనకు లేదంటూ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటిపై విచారణ జరిపి నామినేషన్లకు తిరిగి అవకాశం కల్పించాలా లేదా అన్న విషయం హైకోర్టు తేల్చాల్సి ఉంది. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం రీ నోటిఫై చేశాకే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెబితే మాత్రం మొత్తం ఎన్నికల ప్రక్రియ మొదటికి రానుంది.
మున్సిపల్ పోరుపై ఉత్కంఠ
ఏపీలో గతేడాది వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వచ్చే నెల 2 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రీ షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం గతంలో పూర్తయిన నామినేషన్లు వేసే ప్రక్రియ తర్వాత వాటి ఉపసంహరణ నుంచి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అలా చేస్తే తాము నామినేషన్లు వేసే హక్కు కోల్పోతామని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు వారికి అవకాశం ఇవ్వాలంటే తిరిగి పురపాలక ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి ఎస్ఈసీ నిర్ణయంపై హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.
లేని అధికారాలతో నిమ్మగడ్డ రీ షెడ్యూల్ చేశారా ?
వాస్తవానికి ఎస్ఈసీకి ఉన్న అధికారాల మేరకు ఓసారి స్ధానిక సంస్ధల ఎన్నికలు ఏవైనా అవాంతరాలతో వాయిదా పడితే తిరిగి వాటిని నిర్ణీత గడువులోగా అంటే మూడు నెలలు లేదా ఆరునెలల్లో తిరిగి నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటికీ కుదరకపోతే తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి కొత్త షెడ్యూల్ ప్రకటించాల్సిందే. కానీ ప్రస్తుతం సమయాభావం వల్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ గతంలో ఆగిన చోట నుంచే పురపాలక పోరును తిరిగి నిర్వహించేందుకు వీలుగా రీ షెడ్యూల్ ఇచ్చారు. దీంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. ఇదే అధనుగా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లలో ప్రధానంగా ఎస్ఈసీకి ఎక్కడ నుంచి ఆగిన ఎన్నికలు అక్కడి నుంచే నిర్వహించే అధికారం లేదని వాదన తెరపైకి వచ్చింది.
పోటీ చేసే హక్కు ఉందంటున్న అభ్యర్ధులు
గతేడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ కరోనా కారణంగా ఎన్నికలు ఆరునెలలు వాయిదా పడ్డాయి. అప్పటికీ కరోనా తగ్గకపోవడంతో తిరిగి వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకుని నామినేషన్ల ఉపసంహరణ నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే ఈ ఏడాది కాలంలో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు కూడా అవకాశం కోల్పోతున్నారు. దీంతో తమకు పోటీ చేసే హక్కును కాదనలేరంటూ అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. దీంతో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ఆధారంగా ఓటు హక్కుతో పాటు పోటీ చేసే హక్కు కాపాడాలని కోరుతున్నారు.
మళ్లీ మొదటి నుంచి మున్సిపల్ పోరు ?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం మున్సిపల్ ఎన్నికలను ఆగిన చోట నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు అధికారాలు లేకపోవడం, కొనసాగింపు వల్ల అభ్యర్ధులు కోల్పోయే పోటీ చేసే హక్కు, ఓటర్ల ఓటు వేసే హక్కు హరింపు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మున్సిపల్ పోరు తిరిగి మొదటి నుంచి జరిగినా ఆశ్చర్యం లేదని రాజకీయ పార్టీలే అంచనా వేస్తున్నాయి. అయితే నిన్న అభ్యర్ధుల వాదనలు విన్న హైకోర్టు, ఇవాళ ఎస్ఈసీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనుంది. హైకోర్టులో ప్రతికూల తీర్పు వస్తే మాత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పటికే ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను తిరిగి రీ నోటిఫై చేసి కొత్త షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంటుంది.