సెలెక్ట్ కమిటీల్లో భారీ ట్విస్ట్: మండలి అధికారుల నిర్ణయంతో..: ముందుకు సందేహమే..!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైన మండలి ఛైర్మన్ నిర్ణయంలో భారీ ట్విస్ట్. మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు చట్టం బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం ప్రకటించారు. దీని పైన మండిపడ్డ ప్రభుత్వం ఏకంగా మండలినే రద్దు చేసింది. మండలి రద్దయినా సెలెక్ట కమిటీ కొనసాగుతుందని..ఇందు కోసం కమిటీ ఏర్పాటులో భాగంగా పార్టీల నుండి పేర్లను కోరుతూ లేఖలు రాసామని ఛైర్మన్ ప్రకటించారు.
ఇంతలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని మండలి అధికారులు ముందుకు తీసుకెళ్లటంలో ఇబ్బందులు పడుతున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో అధికార పార్టీ నేతల నుండి మండలి కార్యదర్శికి లేఖలు అందాయి. టీడీపీ మరో వైపు ఒత్తిడి కొనసాగిస్తోంది. ఛైర్మన నిర్ణయం ఫైనల్ అని..ఖచ్చితంగా అమలు చేయాలంటూ టీడీపీ వాదిస్తోంది. దీంతో..ఇప్పుడు మండలిఅధికారులు ఏం చేయబోతున్నారు..సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన బిల్లుల భవిష్యత్ ఏంటి...
ఛైర్మన్ నిర్ణయించినా..అధికారులు మాత్రం..
మూడు రాజధానులు..సీఆర్డీఏ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం అమల్లో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఛైర్మన్ నిర్ణయంతో ఏకంగా మండలినే రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు బిల్లుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సెలెక్ట్ కమిటీల్లో నియమించే ఎమ్మెల్సీల పేర్లు పంపాల్సిందిగా ఆయా పార్టీలకు లేఖలు రాయాలని మండలి ఇన్చార్జి కార్యదర్శికి ఇప్పటికే చైర్మన్ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో చైర్మన్ ఆదేశాల ప్రకారం ఆయన వెంటనే లేఖలు రాస్తారు. కానీ ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉండడంతో ఆయన ఇంతవరకూ ఈ లేఖలు పంపలేదు. ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే యోచనతో తెలుగుదేశం శాసనసభాపక్షం తమ తరపున పది మంది ఎమ్మెల్సీల పేర్ల జాబితాను ఇప్పటికే కార్యదర్శికి అందచేసింది. ఒక్కో కమిటీలో టీడీపీ కోటా కింద ఐదుగురు సభ్యులు వస్తారు. ఇది అందజేసినట్లు కార్యదర్శి నుంచి రశీదు కూడా తీసుకున్నారు.
వైసీపీ నేతల లేఖలతో..మారిన సీన్
టీడీపీ నేతల నిర్ణయంతో..వైసీపీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. మండలిలో సభా నాయకుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం విడివిడిగా కార్యదర్శికి లేఖలు రాశారు. నియమాలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీల ఏర్పాటు జరుగుతున్నందున అందులో తాము భాగస్వామి కాబోమని, తమ పార్టీ నుంచి ఎవరూ ఈ కమిటీల్లో ఉండరని ఉమ్మారెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. కమిటీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం నియమాలకు విరుద్ధమని, అందువల్ల కమిటీలు ఏర్పాటు చేయవద్దని కోరుతూ బోస్ మరో లేఖ రాశారు. ప్రభుత్వ అధికారి అయిన కార్యదర్శి అటు ప్రభుత్వ పక్షం మాట కాదనలేక.. ఇటు చైర్మన్ ఆదేశాలను ధిక్కరించే పరిస్థితి లేక.. ఏ నిర్ణయం తీసుకోకుండా రోజులు నెట్టుకొస్తున్నారని అసెంబ్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అధికారులకు సంకటంగా...
ఏకంగా మండలిలో సభా నాయకుడే లేఖ రాయటంతో..ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని పైన అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అటు ప్రభుత్వం..ఇటు ఛైర్మన్ అదేశాలు కావటంతో ఏం చేయాలనే దాని పైన తేల్చుకోలేకపోతున్నారు. దీంతో..కమిటీల ఏర్పాటు ఆలస్యం అవుతోంది. అయితే, మండలిలో ఛైర్మన్ నిర్ణయమే ఫైనల్ అని..మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానం చేసినా.. రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసే వరకూ మండలి కొనసాగుతుందని చెబుతున్నారు. అప్పటి వరకు ఛైర్మన్ అదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. లేకుంటా అధికారుల పైన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా పరిగణించాల్సి వస్తుందని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఛైర్మన్ అదేశాలను మండలి కార్యదర్శి అమలు చేయాల్సిందేనని టీడీపీ సీనియర్ నేతలు స్పస్టం చేస్తున్నారు. దీందీంతో..ఇప్పుడు మండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు.. బిల్లులను వారికి అప్పగించటం పైన సస్పెన్స కొనసాగుతోంది. కొత్త సందేహాలకు కారణమవుతోంది.