అమరావతి ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులే.. కాకపోతే అవన్నీ ఎక్కడివి : ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ
ఏపీలో రాజధాని అంశం రాజకీయంగా పెద్ద చిచ్చు రేపింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చేస్తుండగా.. అభివృద్ది వికేంద్రీకరణ చేస్తామంటూ వైసీపీ చెబుతోంది. అమరావతి రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టీడీపీ చెబుతుంటే.. అమరావతిలో ఆందోళన చేస్తున్నవారిలో టీడీపీ మనుషులు,పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారని పలువురు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా నటుడు,ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా ఇవే విమర్శలు చేశారు.
అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేస్తున్నది పెయిడ్ ఆర్టిస్టులేనని విమర్శించారు. సాధారణ రైతులైతే వారి వద్ద ఆడి కార్లు,మహిళల చేతులకు బంగారు గాజులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పేరుకే అది రైతుల ఉద్యమం అని,కానీ అక్కడ నడుస్తున్నది కార్పోరేట్ అని విమర్శించారు. రైతుల ముసుగులో సాగుతున్న కార్పోరేట్ ఉద్యమాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజధానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్ కల్యాణ్కు ఇవేవీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కాగా, అమరావతి ఆందోళనల్లో పాల్గొంటున్నది పెయిడ్ ఆర్టిస్టులేనని ఇంతకుముందు కూడా పలువురు వైసీపీ నేతలు విమర్శించారు. లింగులింగుమంటూ 8 ఊళ్ల వాళ్లు చేస్తున్న ఉద్యమం అంటూ వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన గతంలో విమర్శించారు. అమరావతి ఆందోళనలన్నీ బోగస్ అని,అవన్నీ టీడీపీ డైరెక్షన్లో జరుగుతోన్న నిరసనలే అని విమర్శించారు.
ఇక రాజధానిపై గతంలో నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని సాధ్యం కాదని చెప్పిందని తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. జీఎన్రావు కమిటీ,బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలు కూడా అభివృద్ది వికేంద్రీకరణ గురించే ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను అమరావతి నుండి విశాఖ తరలించడం దాదాపుగా ఖాయమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.