పృధ్వీపై దిశా చట్టం పెట్టాలి .. ఎస్వీబీసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కు చైర్మన్ గా కీలక పదవిని నిర్వహించి మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన కమెడియన్ పృధ్వీ తాజాగా బయటకు వచ్చిన రాసలీలల ఆడియో విషయంలో ఎస్వీబీసీ చైర్మన్ గా రాజీనామా చేశారు. అయినప్పటికీ పృధ్వీ రాసలీలల వ్యవహారంపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది .
పథ్వీపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్
మహిళా ఉద్యోగినితో పృథ్వీ అసభ్యకర సంభాషణకు సంబంధించిన ఆరోపణల నేపధ్యంలో పథ్వీపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పృధ్వీ వ్యవహార శైలి ఇప్పటికే నచ్చని పలువురు ఉద్యోగులు తాజా పరిణామాల నేపధ్యంలో టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పిస్తే సరిపోదని వారంటున్నారు.
ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే పృధ్వీపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు పృధ్వీ చైర్మన్ అయిన నాటి నుండీ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వాటిపై కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ టీటీడీకి భ్రష్టు పట్టించిన పృథ్వీపై టీటీడీ పరువు నష్టం దావా వేయాలని వారు అంటున్నారు. ప్రసిద్ధం పుణ్య క్షేత్రం , ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమలలో ఎస్వీ బీసీ చైర్మన్ గా ఉండి ఆయన చేసిన పని సిగ్గు చేటని, హేయమైన పని అని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు చెప్పారు.
జగన్ ఆదేశాలతోనే ఎస్వీబీసీ చైర్మన్ గా పృధ్వీ రాజీనామా
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు తమకు వెన్ను దన్నుగా నిలిచిన పలువురికి పలు కీలక పోస్టులు ఇచ్చారు. అలా కమెడియన్ పృధ్వీ కూడా ఎస్వీబీసీ చైర్మన్ అయ్యారు. కానీ అనతికాలంలోనే ఆ పదవికి రాజీనామా చేసి పరువు పోగొట్టుకున్నారు. మహిళా ఉద్యోగినితో పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడినట్లు ఉన్న ఆడియో టేపులు వైరల్గా మారటంతో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది . దీంతో జగన్ ఆదేశాల మేరకు వైవీ సుబ్బారావు సూచనలతో పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు .
పృధ్వీ వ్యవహారంపై నిజనిర్ధారణ కమిటీ వేసిన టీటీడీ
అంతే కాదు అది తన వాయిస్ కాదని, మార్ఫింగ్ చేసి ఎవరో తనను ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు. అయినా జగన్ సీరియస్ కావటంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన రాజీనామా చేశారు . తనపై విచారణ ముగిసిన తరువాత మళ్లీ ఆ సీట్లో కూర్చుంటానంటూ చెప్పుకొచ్చారు.కానీ మళ్ళీ ఆయనకు అవకాశం ఇవ్వటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఈ వ్యవహారంపై విచారణ కోసం నిజ నిర్ధారణ కమిటీని నియమించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.