వర్సిటీ క్యాంపస్లో నారా లోకేష్ బర్త్ డే వేడుకలు: నిప్పులు చెరిగిన జగన్ పార్టీ విద్యార్థులు
తిరుపతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో అధికారులు నిర్వహించడంపై విద్యార్థులు నిప్పులు చెరిగారు.
విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం వద్ద విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. వైస్ చాన్సలర్ ఎ దామోదరం, రిజిస్ట్రార్ ఎం దేవరాజులు, రెక్టార్ ఎం భాస్కర్ నారా లోకేష్ జన్మదిన వేడుకలను విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్వహించారని విద్యార్థులు ఆరోపించారు. ఆ ముగ్గురిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన విద్యార్థి విభాగం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. క్యాంపస్లో జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకలకు వైస్ చాన్సలర్తో పాటు ఇతర విద్యార్థులు హాజరయ్యారని వైసిపి విద్యార్థి విభాగం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వి హరిప్రసాద్ రెడ్డి విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్ ఆ వేడుకలను నిర్వహించింది. రాజకీయ కార్యక్రమాలను విశ్వవిద్యాలయాల్లో అనుమతించకూడదని ఎపి ప్రభుత్వం గత సెప్టెంబర్లో విశ్వవిద్యాలయాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను విశ్వవిద్యాలయ అధికారులు ఉల్లంఘించారని హరిప్రసాద్ రెడ్డి విమర్శించారు.
శనివారంనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని నిర్వహించని అధికారులు లోకేష్ జన్మదిన వేడుకలకు అనుమతి ఇచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన విమర్శించారు.