మోడీ కల: 110 పట్టణాలతో ఏపీ సెకండ్, రూ.186 కోట్లు ఇస్తున్న వెంకయ్య
తిరుపతి: బహిరంగ మల విసర్జన అలవాటు ఏమాత్రం లేని పట్టణాలు, నగరాల పరంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించాయి. దేశంలో ఇలా ప్రకటించిన తొలి రెండు రాష్ట్రాలుగా నిలిచాయి. తమకున్న 110 పట్టణ ప్రాంతాలనూ బహిరంగ మల విసర్జన రహితాలుగా ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం తిరుపతిలో ప్రకటించారు.
180 పట్టణాలు/నగరాల్లో ఆరు బయట మల విసర్జన అలవాటును పూర్తిగా రూపుమాపినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పోరుబందర్లో తెలిపారు. మహాత్మా గాంధీ స్వస్థలమైన పోరుబందర్ గ్రామస్తులతో కేంద్రమంత్రి మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.
పోరుబందర్ సాధించిన ఘనత రూపంలో మహాత్మా గాంధీకి మధ్యంతర కానుక ఇస్తున్నట్లయిందన్నారు. ఏపీకి ప్రోత్సాహకంగా పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల యాజమాన్యానికి రూ.186 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు.
కాగా, స్వచ్ఛ భారత్ ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆదివారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ వద్ద నుంచి స్వచ్ఛ భారత్ ప్రచార ర్యాలీని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి ప్రారంభించారు. పుదుచ్చేరి, రాజ్కోట్, వారణాసి సహా దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలను ప్రధాని మోడీ ట్విటర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
ప్రసార మాధ్యమాలు, కార్పొరేట్ సంస్థలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ఒక్కో వ్యక్తి తన చుట్టూ ఉన్న పది గజాల స్థలాన్ని శుభ్రం చేయాలనే సంకల్పం తీసుకుంటే మోడీ కల నెరవేరుతుందన్నారు.