టీటీడీ బోర్డులో క్రిస్టియనా?.. ఏమిటి గ్రహచర్యం: స్వామి పరిపూర్ణానంద
విజయవాడ: టీటీడీ కొత్త పాలక మండలి నియామకం పట్ల స్వామి పరిపూర్ణానంద అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డు సభ్యుల్లో ఎమ్మెల్యే అనితను చేర్చడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎమ్మెల్యే అనిత ఓ క్రిస్టియన్ అని.. వేరే మతస్తులను టీటీడీలో ఎలా సభ్యులుగా చేరుస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత తాను క్రిస్టియన్ అని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాన్ని ఆయన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'టీటీడీ నూతన పాలక మండలిలో ఓ క్రిస్టియన్ కి అవకాశం ఇవ్వడం ఏమిటి?.. ఇది ఏమి గ్రహచర్యం.. ఇది ఏమి న్యాయం?.. హిందువుల మౌనం చేతకానితనంగా భావిస్తున్నారా?.. ప్రశ్నించే సమయం ఆసన్నం అయింది' అని పరిపర్ణానంద వ్యాఖ్యానించారు.
బోర్డు నియామకం:
ఎట్టకేలకు ఏడాది తర్వాత శుక్రవారం నాడు టీటీడీ బోర్డు నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. జీవో ఎంఎస్ నంబర్ 194ప్రకారం చైర్మన్, సభ్యుల పేర్లను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియమంచిన టీటీడీ బోర్డుల్లో కచ్చితంగా ఒకరిద్దరు తమిళులకు కూడా అవకాశం ఇస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం తమిళులెవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు. బోర్డులో తమిళులకు స్థానం కల్పించలేదు. కొత్తగా నియమించిన బోర్డు రెండేళ్ల పాటు కొనసాగనుంది.