తిరుమల కొండతో పెట్టుకుంటే బూడిదే .. కొడాలి నానీ వ్యాఖ్యలపై పరిపూర్ణానంద ఫైర్
తిరుమలపై, తిరుమలలో డిక్లరేషన్ పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద ఫైర్ అయ్యారు. హిందూ దేవాలయాల గురించి, హిందూ దేవుళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి నాని చేస్తున్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయా లేదా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ సమాధానం చెప్పకపోతే ఆయనే మాట్లాడినట్లుగా అనుకోవాల్సి వస్తుందంటూ పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు.
డిక్లరేషన్ తప్పని సరి అని పేర్కొన్న పరిపూర్ణానంద
తిరుమల స్వామివారి దర్శన విషయంలో డిక్లరేషన్ అనాదిగా వస్తున్న ఆచారమని, దర్శనార్థం వెళ్లే సమయంలో అన్య మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని స్వామి పరిపూర్ణానంద తేల్చిచెప్పారు. ఏపీలో మంత్రులు వివాదాలను పెంచడంలో దిట్టగా మారారని, అగ్నికి ఆజ్యం పోసినట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై దాడులు చెయ్యటం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు . సీఎం జగన్మోహన్ రెడ్డి పై హిందువులు ఎంతో విశ్వాసం పెట్టుకున్నారని, ఆ నమ్మకానికి చెందిన పునాదులను సైతం నాశనం చేస్తున్నారని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు .
తిరుపతిపై నానీ అనుచిత వ్యాఖ్యలు దారుణం
ఇతర మతస్తుల ప్రార్థనా మందిరాల మీద ఎవరు వ్యాఖ్యలు చేయరని, కేవలం హిందూ దేవాలయాల గురించి వ్యాఖ్యలు చేయడం నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు. చరిత్ర తెలియకపోతే కొడాలి నాని తెలుసుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లో పార్టీలు మారే స్వభావం ఉన్న కొడాలి నాని ఈరోజు ఉన్న పార్టీలో రేపు ఉంటాడన్న గ్యారెంటీ లేదంటూ ఎద్దేవా చేశారు. తిరుపతి ఎవడబ్బ సొత్తు అంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం దారుణమైన విషయమని పరిపూర్ణానంద మండిపడ్డారు.
నానీ .. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. హెచ్చరించిన స్వామి
కొడాలి నానికి దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి లేదని, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. తిరుమల కొండతో పెట్టుకున్న వాళ్ళ బూడిద కూడా దొరకలేదని చరిత్ర చెబుతోందన్నారు పరిపూర్ణానంద స్వామి. కొడాలి నానిలా తాను బజారు మాటలు మాట్లాడలేనని ఆయన నానీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. హిందువుల మనోభావాలను సీఎం జగన్ కచ్చితంగా గౌరవించాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని, జగన్ స్పందించాలని పేర్కొన్నారు.
సీఎం జగన్ స్పందించాలని పరిపూర్ణానంద డిమాండ్
మంత్రి కొడాలి నాని తన శాఖ వరకు సరిగా చూసుకుంటే మంచిదని హితవు పలికారు. గతంలో దేవుళ్ళను పీఠాలను లెక్కచేయని జయలలిత ,ఇందిరాగాంధీ ల గతి ఏమైందో చూడాలని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. హిందువుల ఓటుబ్యాంకు తో అధికారంలోకి వచ్చి, హిందువుల మనోభావాలను గౌరవించకపోవటం హేయమైన చర్య అని తెలిపారు. సీఎం జగన్ ఈ వ్యవహారంలో ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు స్వామి పరిపూర్ణానంద.