జేసీ సోదరుల నుంచి రక్షణ కల్పించండి:సిఎం నివాసం వద్ద స్వామీ ప్రబోధానంద అనుచరుల ఆందోళన
అమరావతి:అనంతపురం జిల్లాలో తాడిపత్రి ప్రబోధానంద, జేసీ సోదరులకు మధ్య వివాదం పంచాయతీ మరోసారి సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. గతంలో స్వామి ప్రబోధానందపై ఎంపి జెసి సిఎంకు ఫిర్యాదు చేయగా ఈసారి మాత్రం అందుకు ఉల్టా జరిగింది.
స్వామి ప్రబోధానంద అనుచరులే జేసీ సోదరుల అకృత్యాలపై ఫిర్యాదు చేసేందుకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అంతేకాదు ఎంపి జెసిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. జేసీ సోదరుల చర్యల కారణంగా తామంతా భయాందోళనకు గురి అవుతున్నామని వారు వాపోయారు.
జెసి సోదరులు ఆశ్రమంలోని భక్తులను బలవంతంగా ఖాళీ చేయిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అదేమని ప్రతిఘటించినందుకు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని స్వామి ప్రబోధానంద అనుచరులు ఆదేవన వ్యక్తం చేశారు. తమకు జేసీ సోదరుల నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని సీఎంను కోరేందుకు ఆయన నివాసానికి వచ్చినట్టు వారు తెలిపారు. అసలు ఈ వివాదంలో తామే నిజమైన బాధితులమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రబోధానంద ఆశ్రమంనుంచి జెసి దివాకర్రెడ్డి వర్గం డబ్బు డిమాండ్ చేసిందని వారు ఆరోపించారు. తాము డబ్బు ఇవ్వనందుకే తమపై దాడి చేయించారని చెప్పారు. తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా తమపైనే ఎదురు కేసులు పెట్టారని వారు వాపోయారు.
జెసి దివాకర్ రెడ్డి గురించి స్వామి ప్రబోధానంద శిష్యుడు మీడియాతో మాట్లాడుతూ..."ఆశ్రమానికి వచ్చిన వందలాది మందికి కులాంతర వివాహాలు చేసిన ఘనత స్వామివారిది...అలా సమసమాజాన్ని స్థాపించాలనే గొప్ప భావంతోనే ప్రభోదానందస్వామి ఉన్నారు...ఇలాంటి మందిరానికి పేరు ప్రఖ్యాతలు రావడం, అక్కడికి వచ్చే భక్తుల సంఖ్యపెరగడంతో త్రైత సిద్ధాంత జ్ఞానం దక్షిణ భారతదేశం నలువైపులా వ్యాపించడం.. దీనివల్ల స్వామి వారికి కీర్తిప్రతిష్టలు పెరుగుతున్నాయనే ఈర్ష్యా పూరితమైన ఉద్దేశంతో, జేసీ ఆశించిన ధనం అందకపోవడంతో గత కొన్నిసంవత్సరాలుగా ఇద్దరు బ్రదర్స్ ఆశ్రమ భక్తులను ఇబ్బంది పెట్టారు"
"ఆశ్రమం పైపులైన్స్ పగలకొట్టడం, కరెంట్ కట్ చేయించడం, ఇసుక తోలుకుంటున్న లారీలను ఆపేయడం, అప్రూవల్ ప్రకారమే నిర్మాణాలు జరుగుతుంటే సర్టిఫికెట్స్ను చూపించినా ఇబ్బంది పెట్టడం చేశారు. మేం కోర్టుకు వెళ్లగా అక్కడ ఆయనకు అక్షింతలు పడ్డాయి. గతంలో ఎప్పటినుంచో ఇది ఇలా దురుద్దేశపూర్వకంగా జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామస్థులను దారిమళ్లించి మందిరంవైపుకు తీసుకొచ్చి మహిళలపై కుంకుమ చల్లుతూ అసభ్యంగా దూషించడంతో తప్పనిపరిస్థితిలో అక్కడున్న భక్తులు వారిని ప్రశ్నించడం జరిగింది. అది కాస్త చినికి చినికి గాలివానలా గొడవ జరిగింది".
"దీంతో పోలీసులు వచ్చి మమ్మల్ని వేరో చోటికి తరలించారు. ఆ మరుసటి రోజు మళ్లీ జేసీ వాహనాల్లో అనుచరులు, వర్గీయులతో వచ్చి విచక్షణా రహితంగా మాపై దాడి చేయించారు. అలా జరుగుతుంటే 300 మంది పోలీసులు సైతం నిశ్చేష్టులై చూస్తున్నారు. వాస్తవంగా జేసీ సోదరుల చర్యలతో మేము తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నాం. అందుకే జేసీ వర్గీయులపై కేసులు పెట్టాలి అని ముఖ్యమంత్రిని కోరేందుకు వచ్చాం"...అని ప్రభోదానంద అనుచరులు తెలిపారు.
మా ఆశ్రమంలో ఉండే వారిపై జెసి వర్గీయులు పలుకేసులు పెట్టడం జరిగిందని...వాటన్నింటికీ తాము హాజరవుతున్నామని...కానీ మేము కేసులు పెడితే ఒక్కటి కూడా స్వీకరించిన దాఖలాల్లేవని ప్రభోదానంద అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలని సిఎం చంద్రబాబు కోరేందుకే ఇక్కడకు వచ్చామన్నారు. ఆశ్రమంలో ఇదివరకున్న శాంతియుత వాతావరణాన్ని మరల పునరుద్ధరించమని, భక్తుల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని...అందుకు సీఎం ఆదేశాలివ్వాల్సిందిగా కోరడానికి వచ్చామన్నారు. ఈ విషయాలన్నింటినీ వినతిపత్రం రూపంలో సీఎం చంద్రబాబు తెలియజేస్తామని ప్రభోదానంద స్వామి శిష్యులు చెప్పారు. అయితే సిఎం వీరి వినతి విషయమై ఎలా స్పందిస్తారనేది ప్రాధాన్యత సంతరించుకుంది.