టిటిడి ఈవోగా ఉత్తరాది వ్యక్తా: చంద్రబాబుపై స్వరూపానంద ఆగ్రహం
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై శారదా పీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది వారిని టిటిడి ఈవోగా నియమించడాన్ని తప్పుబట్టారు.
అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై శారదా పీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది వారిని టిటిడి ఈవోగా నియమించడాన్ని తప్పుబట్టారు.
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని నియమించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మాజీ ఈఓ సాంబశివరావును మార్చడం పనికిమాలిన ఆలోచన అని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఈ సంఘటనే నిదర్శనమన్నారు. మాజీ ఈవో నిజాయితీపరుడు అన్నారు.
తెలుగు చదవడం, మాట్లాడటం రాని వారిని ఈఓగా ప్రభుత్వం ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. ఈఓ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆగమానికి సంబంధించి సమస్యలు వస్తాయన్నారు.
ఉత్తర ప్రాంతంలో ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందన్నారు. టీటీడీకి ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై కోర్టుకు వెళతామని, ఇక ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి చర్యలు తీసుకోకుండా పోరాటం చేస్తానన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రేసులో ఉన్నారని అభిప్రాయపడ్డారు. చైర్మన్ పదవి రాజకీయాలకు అతీతమైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు.