ఎస్బీబాలు సంగీత శిఖరమన్న స్వరూపానంద - శారదాపీఠంతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ..
చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ శివైక్యం పొందిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్పందించారు. ఆయనతో వ్యక్తిగతంగా తనకూ, శారదా పీఠానికీ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎస్పీ బాలు శివైక్యం పొందడం ఎంతో బాధాకారమన్నారు.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా స్వామి స్వరూపానంద అభివర్ణించారు. సంగీతమే ఊపిరిగా బాలు జీవించారని గుర్తు చేసుకున్నారు. విశాఖ శారదాపీఠంతో బాలుకు ఎంతో మంది అనుబంధం ఉందన్నారు. శ్రీశైలం వెళ్లినా ఎస్పీ బాలు శారదా పీఠంలోనే ఉండేవారని స్వరూపానంద గుర్తు చేసుకున్నారు. ఎస్పీ బాలు గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం అని స్వరూపానంద తెలిపారు. ఎస్పీ బాలు ఆత్మ భగవంతుని పాద చరణాల వద్దకు చేరాలని కోరుకుంటున్నట్లు స్వరూపానంద తెలిపారు.
ఎస్పీ బాలుతో శారదాపీఠానికి, స్వరూపానందకు ఎంతో అనుబంధం ఉండేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆయన ఎప్పుడు విశాఖ వచ్చినా స్వరూపానందను కలవకుండా వెళ్లేవారు కాదని కూడా చెప్తుంటారు. కానీ స్వరూపానంద ఎప్పుడూ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఎస్పీ బాలు మరణంతో స్వరూపానంద తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది.